అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో తమ స్థానంపై ప్రభావం చూపనప్పటికీ సీఎస్కే నెట్ రన్ రేటును తగ్గించుకుంది. 12 మ్యాచ్లు ఆడిన చెన్నై 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు సీఎస్కేపై గెలిచిన గుజరాత్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 231 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (104; 55 బంతుల్లో, 9x4, 6x6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5x4, 7x6) శతకాలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరు తొలి వికెట్కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చెన్నై బౌలర్లలో తుషార్ (2/33) రెండు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో, 7x4, 3x6), మొయిన్ అలీ (56; 36 బంతుల్లో, 4x4, 4x6) అర్ధశతకాలతో పోరాడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ (3/31) మూడు, రషీద్ ఖాన్ (2/38) రెండు వికెట్లతో సత్తచాటారు.
ఛేజింగ్లో 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మిచెల్, అలీ ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 57 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో ధోనీ (26*; 11 బంతుల్లో, 1x4, 3x6) సిక్సర్లతో అలరించి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలను సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వివరించాడు. చెత్త ఫీల్డింగ్యే తమ కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు.
''ఫీల్డింగ్లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం. ప్రణాళిక అమలులో బాగానే ఉన్నాం. కానీ గిల్-సుదర్శన్ చాలా మంచి షాట్లు ఆడారు. బాగా ఆడుతున్న బ్యాటర్లను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. తిరిగి చెన్నైకి చేరుకోవాలి, ఎక్కువ సమయం లేదు. ఆదివారం మధ్యాహ్నం మరో మ్యాచ్ ఉంది. రాజస్థాన్ రాయల్స్తో టఫ్ ఫైట్ ఉంది'' అని రుతురాజ్ పేర్కొన్నాడు. చెపాక్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్తో సీఎస్కే తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.