అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఆటగాళ్లు రెచ్చిపోయారు. రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఇదంతా ఒక ఎత్తయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో బ్యాటింగ్ చేసేందుకు ఆ జట్టు కెప్టెన్ ధోనీ బరిలోకి ఎంటర్ కాగానే స్టేడియం రీసౌండ్ రెట్టింపు అయ్యింది
వాస్తవానికి గుజరాత్ జట్ట హోంగ్రౌండ్ అయినప్పటికీ స్టేడియంలో మాత్రం ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ జర్సీ కలర్ పసుపు రంగే కనిపించింది.నరేంద్ర మోదీ స్టేడియం అంతా పుసుపుమయం అయ్యింది. ఇదంతా కేవలం ఒకే ఒక వ్యక్తి కోసం ఇలా మారిపోయింది. అతనే ధోనీ. అవును ధోనీ కోసమే చాలామంది గుజరాతీలు కూడా వారి టీమ్కు సపోర్ట్ చేయడం మానేసి ఎల్లో కలర్ జెర్సీలు వేసుకుని ధోనీ ధోనీ అంటూ నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించి అభిమానం చాటుకున్నారు.

ఇక ఇన్నింగ్స్ 17.4వ ఓవర్లో జోసెఫ్ బౌలింగ్లో బౌండరీ కోసం ప్రయత్నించి రవీంద్ర జడేజా శంకర్కు చిక్కాడు. దీంతో స్టేడియంలోని అభిమానులు గట్టిగా కేకలు వేశారు. అయితే వారంతా కేకలు వేసిన కారణం వేరు. ఆ సమయంలో ధోనీ బ్యాటింగ్ చేసేందుకు క్రీజ్ వైపు కదిలాడు. ధోనీ బ్యాటింగ్ మిస్ అవుతామనుకున్న వారికి చివర్లో ఈ జార్ఖండ్ డైనమైట్ డిసప్పాయింట్ చేయలేదు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ రెచ్చిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ తనలో ఏమాత్రం పస తగ్గలేదని నిరూపించుకున్నాడు. జోష్ లిటిల్ వేసిన చివరి ఓవర్లో ఓ భారీ సిక్స్, ఓ ఫోర్ బాది చుక్కలు చూపించాడు. ఎదుర్కొన్న 5 బంతుల్లో 13 పరుగులు చేసి స్కోరును 178 పరుగులకు చేర్చాడు.