ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పంజా విసిరింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన పోరులో 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అశలను గుజరాత్ సజీవంగా ఉంచుకుంది. మరోవైపు సీఎస్కే టాప్-4లోనే కొనసాగుతున్నప్పటికీ తదుపరి దశకు చేరుకోవడానికి అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 231 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (104; 55 బంతుల్లో, 9x4, 6x6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5x4, 7x6) శతకాలతో విరుచుకుపడ్డారు. వీరిద్దరు తొలి వికెట్కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చెన్నై బౌలర్లలో తుషార్ (2/33) రెండు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 196 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో, 7x4, 3x6), మొయిన్ అలీ (56; 36 బంతుల్లో, 4x4, 4x6) అర్ధశతకాలతో పోరాడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ (3/31) మూడు, రషీద్ ఖాన్ (2/38) రెండు వికెట్లతో సత్తచాటారు.
చెన్నైకు పేలవారంభం దక్కింది. 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర (1; 2 బంతుల్లో), ఇంపాక్ట్ ప్లేయర్ అజింక్య రహానె (1; 5 బంతుల్లో), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (డకౌట్; 3 బంతుల్లో) వరుసగా పెవిలియన్కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన అలీ, మిచెల్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 57 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ క్రమంలో డారిల్ మిచెల్ 27 బంతుల్లో, అలీ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. అయితే అర్ధశతకాలు సాధించిన అనంతరం వీరిద్దరు ఔటయ్యారు. కుదురుకున్న ఈ బ్యాటర్లను మోహిత్ శర్మ పెవిలియన్కు చేర్చాడు. తర్వాత వచ్చిన శివమ్ దూబె (21; 13 బంతుల్లో, 2x4, 1x6), రవీంద్ర జడేజా (18; 10 బంతుల్లో, 2x4, 1x6), మిచెల్ శాంట్నర్ (డకౌట్; 2 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆఖర్లో ధోనీ (26*; 11 బంతుల్లో, 1x4, 3x6) సిక్సర్లతో అలరించాడు.
గిల్-సుదర్శన్ మెరుపు శతకాలు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఆది నుంచే దూకుడుగా ఆడింది.గిల్-సుదర్శన్ నువ్వా-నేనా అన్నట్లుగా పోటీపడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో 25 బంతుల్లో గిల్, 32 బంతుల్లో సుదర్శన్ అర్ధశతకం సాధించారు. హాఫ్ సెంచరీ అనంతరం వాళ్ల విధ్వంసం కొనసాగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 12.4 ఓవర్లలో గుజరాత్ 150, 16.2 ఓవర్లలో 200 స్కోరు మార్క్ను అందుకుంది. మరోవైపు గిల్, సుదర్శన్ శతకాలు బాదారు. ఇద్దరూ 50 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్నారు.
అయితే సెంచరీ సాధించిన తర్వాత గిల్, సుదర్శన్ పెవిలియన్కు చేరారు. 18వ ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరిని తుషార్ దేశపాండే పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత గుజరాత్ స్కోరు వేగం తగ్గింది. సీఎస్కే చివరి నాలుగు ఓవర్లలో 41 పరుగులే ఇచ్చింది.