డూ ఆర్ డై మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ (104; 55 బంతుల్లో, 9x4, 6x6), సాయి సుదర్శన్ (103; 51 బంతుల్లో, 5x4, 7x6) విధ్వంసం సృష్టించారు. శతకాలతో విరుచుకుపడి చెన్నై సూపర్ కింగ్స్కు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అహ్మదాబాద్ వేదికగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. గిల్, సుదర్శన్ మొదటి వికెట్కు ద్విశతక (210) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చెన్నై బౌలర్లలో తుషార్ (2/33) రెండు వికెట్లు తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆది నుంచే దూకుడుగా పరుగులు సాధించింది. శాంట్నర్ వేసిన తొలి ఓవర్లో గిల్ ఫోర్, సిక్సర్ బాది తన ఉద్దేశాన్ని చాటిచెప్పాడు. మరోవైపు తొలుత నిదానంగా ఆడిన సాయి సుదర్శన్ తర్వాత క్రమంగా బౌండరీల మోత మోగించాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ఉద్దేశంతో కాకుండా వీరిద్దరు సంయమనంతో ఆడుతూ పవర్ప్లేలో 58 పరుగులు స్కోరు సాధించారు.

ఆ తర్వాత గిల్-సుదర్శన్ టాప్ గేర్లో దూసుకెళ్లారు. నువ్వా-నేనా అన్నట్లుగా ఇద్దరూ పోటీపడుతూ పరుగులు సాధించారు. జడేజా బౌలింగ్లో వరుసగా 14, 15 పరుగులు పిండుకున్నారు. వాళ్ల ధాటికి గుజరాత్ పది ఓవర్లలో 107 పరుగులు చేసింది. సిమర్జిత్ వేసిన 11వ ఓవర్లో సుదర్శన్ రెండు సిక్సర్లు, గిల్ ఓ ఫోర్, సిక్సర్ బాదడంతో ఏకంగా 23 పరుగులు వచ్చాయి.
ఈ క్రమంలో 25 బంతుల్లో గిల్, 32 బంతుల్లో సుదర్శన్ అర్ధశతకం సాధించారు. హాఫ్ సెంచరీ అనంతరం వాళ్ల విధ్వంసం కొనసాగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 12.4 ఓవర్లలో గుజరాత్ 150, 16.2 ఓవర్లలో 200 స్కోరు మార్క్ను అందుకుంది. మరోవైపు గిల్, సుదర్శన్ శతకాలు బాదారు. ఇద్దరూ 50 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్నారు.
అయితే సెంచరీ సాధించిన తర్వాత గిల్, సుదర్శన్ పెవిలియన్కు చేరారు. 18వ ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరిని తుషార్ దేశపాండే పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత గుజరాత్ స్కోరు వేగం తగ్గింది. సీఎస్కే చివరి నాలుగు ఓవర్లలో 41 పరుగులే ఇచ్చింది. 18వ ఓవర్లో 4 పరుగులు, 19వ ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ 6 పరుగులు, ఆఖరి ఓవర్ వేసిన సిమర్జిత్ 12 పరుగులే ఇవ్వడం గుజరాత్ 231 పరుగులకే పరిమితమైంది. డేవిడ్ మిల్లర్ (16*; 11 బంతుల్లో, 1x4), షారుక్ ఖాన్ (2; 3 బంతుల్లో) పరుగులు చేశారు.