
హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా పేసర్ ఇర్ఫాన్ పఠాన్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, భారత మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ ప్రశంసలు కురిపించాడు. ఇర్ఫాన్ పఠాన్ ఎంతో ధైర్యవంతుడు, నిస్వార్థ ఆటగాడు. జట్టు కోసం ఎలాంటి పాత్ర పోషించడానికికైనా సిద్ధంగా ఉండేవాడు అని తెలిపాడు. పఠాన్ తన బౌలింగ్ లయను కోల్పోవడానికి ఛాపెల్ ప్రయోగాలే కారణమని గతంలో పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రెగ్ ఛాపెల్ మాట్లాడుతూ... 'ఇర్ఫాన్ పఠాన్ ఎంతో ధైర్యవంతుడు, నిస్వార్థ ఆటగాడు. జట్టు కోసం ఎలాంటి పాత్ర పోషించడానికికైనా సిద్ధంగా ఉండేవాడు. మంచి ఆల్రౌండర్ అని నిరూపించుకున్నాడు. వన్డేల్లో విశేషంగా రాణించాడు. టెస్టుల్లో కూడా ఫర్వాలేదనిపించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్స్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు. కరాచిలో పాకిస్థాన్తో జరిగిన టెస్టులో తొలి ఓవర్లోని హ్యాట్రిక్ అతని అత్యుత్తమ ప్రదర్శన' అని తెలిపాడు.
రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో టాప్ ఆర్డర్లో పఠాన్ బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఛాపెల్ ప్రయోగాల కారణంగా పఠాన్ బ్యాటింగ్పై దృష్టి పెట్టడంతో.. బౌలింగ్ లయను కోల్పోయాడు. ఏకంగా జట్టుకే దూరమయ్యాడు. అప్పట్లో ఛాపెల్పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నింటిని పఠాన్ ఖండించాడు. 'నా పతనానికి ఛాపెల్ కారణమని చెప్తే సాకులు వెతుక్కోవడమే. నేను స్వింగ్ కోల్పోయానని చాలామంది అన్నారు. కొత్త బంతితో మాదిరి స్వింగ్ను ఎప్పుడూ రాబట్టడం సాధ్యం కాదు. నా చివరి మ్యాచ్ ఆడేటప్పటికీ నేను స్వింగ్ చేస్తూనే ఉన్నా' అని పఠాన్ పేర్కొన్నాడు.
ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ల నిడివిని నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిపాదననకు పఠాన్ మద్దతు తెలిపాడు. నాలుగు రోజుల మ్యాచ్ల ద్వారా ఫలితాలపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున పఠాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1,105 పరుగులు చేసి 100 వికెట్లు తీశాడు. వన్డేల్లో 1,544 పరుగులతో పాటు 173 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 172 పరుగులు, 28 వికెట్లు తీశాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో ఇర్ఫాన్ సభ్యుడు. పఠాన్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ జట్టుకు మెంటార్గా ఉన్నాడు.