
మెల్బోర్న్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే మళ్లీ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. శనివారం మెల్బోర్న్లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశం సందర్భంగా కొత్త ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఈ పదవి కోసం తొలుత- జింబాబ్వే క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ తవెంగ్వా ముకుహ్లాని పోటీ పడ్డారు. చివరి నిమిషంలో ఆయన ఈ రేసు నుంచి తప్పుకున్నారు. దీనితో బార్క్లే ఎన్నిక ఏకగ్రీవమైంది. వరుసగా రెండోసారి ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టారు.
న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు చెందిన అడ్వొకేట్ గ్రెగ్ బార్క్లే. గతంలో ఆయన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్గా పని చేశారు. ఐసీసీ ప్రపంచ కప్ 2015కు డైరెక్టర్గా వ్యవహరించారు. తొలిసారిగా 2020 నవంబర్లో ఐసీసీ ఛైర్మన్గా అపాయింట్ అయ్యారు. అదే పదవిలో మళ్లీ పునర్నియామకం అయ్యారు. మరో రెండు సంవత్సరాల పాటు ఆయన ఇదే హోదాలో కొనసాగనున్నారు.
ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఆయనకు మంచి మెజారిటీ ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఐసీసీలో మొత్తంగా 17 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇందులో 12 మందికి పైగా డైరెక్టర్లు గ్రెగ్ బార్క్లే వైపు మొగ్గు చూపారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కూడా బార్క్లే నాయకత్వానికే జై కొట్టింది. మిగిలిన డైరెక్టు్లు తవెంగ్వా ముకుహ్లానికి మద్దతు ప్రకటించారు. చివరి నిమిషంలో ఆయన ఐసీసీ ఛైర్మన్ పదవి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
దీనితో బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా గ్రెగ్ బార్క్లేకే మద్దతు ప్రకటించారు. దీనితో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐతో పాటు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్, క్రికెట్ ఆస్ట్రేలియా వంటి పవర్ఫుల్ బోర్డులన్నీ గ్రెగ్ వైపు మొగ్గు చూపాయి. ఇక ఐర్లాండ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మరో వైపున ఉన్న ఎలైట్ ఐసీసీ బోర్డులోని చిన్న జట్లకు తవెంగ్వా ప్రాతినిథ్యాన్ని వహించారు. గ్రెగ్కు గట్టిపోటీ ఇస్తారని భావించినప్పటికీ- తవెంగ్వా పోటీ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తరువాత తవెంగ్వా మాట్లాడారు. ఐసీసీ ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే పునర్నియమితుడు కావడం తనకు సంతోషాన్నిస్తోందని వ్యాఖ్యానించారు. అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన మరో టర్మ్ కూడా ఐసీసీ ఛైర్మన్గా కొనసాగాల్సిన అవసరం ఉందని, అది క్రికెట్ను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. కొత్త దేశాలు క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపుతాయని పేర్కొన్నారు.
తన ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తరువాత బార్క్లే- బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ళలో క్రికెట్కు కొత్త దేశాలకు విస్తరింపజేయడంలో విజయం సాధించామని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు. ఈ గేమ్ను మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.