
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవడం భారత క్రికెట్కు శుభసూచికమని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ ఎన్నికపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తన ట్విట్టర్లో "కంగ్రాట్స్ దాదా. భారత క్రికెట్కు ఇది శుభసూచికం. ఇదివరకే భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించిన దాదా కొత్త బాధ్యతల్లో మరింత ముందుకు సాగాలి" అంటూ ట్వీట్ చేశాడు.
బీసీసీఐ అధ్యక్ష పదవికి బ్రిజేష్ పటేల్ గట్టిపోటీనిచ్చినా ఎక్కువ సంఘాలు గంగూలీకే మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయింది. అధ్యక్ష పదవిలో గంగూలీ 2020 సెప్టెంబర్ వరకు కొనసాగనున్నాడు.
2000వ సంవత్సరంలో భారత జట్టు కెప్టెన్గా గంగూలీ బాధ్యతలు చేపట్టిన సమయంలో భారత క్రికెట్ తీవ్ర సంక్షోభవంలో ఉంది. అప్పట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం ఓ పెద్ద కుదుపు కుదిపింది. అలాంటి సమయంలో జట్టు పగ్గాలు అందుకున్న గంగూలీ తనదైన శైలిలో దూకుడు నేర్పించి టీమిండియా విదేశాల్లో సైతం టెస్టులు నెగ్గగలదని నిరూపించాడు.
నామినేషన్ అనంతరం గంగూలీ మాట్లాడుతూ "ఈ పదవిని నేను ఎప్పుడూ ఆశించలేదు. కనీసం ఎవరితోనూ చెప్పలేదు. ఆదివారం రాత్రి 10:30 వరకు కూడా ఈ విషయం నాకు తెలియదు. అప్పుడే చెప్పారు నువ్వే బీసీసీఐ ప్రెసిడెంట్ కావాలని. దేశం కోసం ఆడాను, సారథిగా కూడా బాధ్యతలు చేపట్టాను, గత మూడేళ్ల నుంచి బీసీసీఐ పనితీరు సరిగా లేదు. ఇలాంటి సందర్భంలో బాధ్యతలు స్వీకరించడం గొప్ప అవకాశమే" అని గంగూలీ అన్నాడు.
"బీసీసీఐలో పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. మరికొన్ని నెలల్లో అన్ని వ్యవస్థలు ప్రక్షాళన చేసి.. మళ్లీ భారత క్రికెట్కు పూర్వవైభవం తీసుకొస్తాం. ఏకపక్షంగా గెలవడం ముఖ్యం కాదు అని, ప్రపంచ క్రికెట్లోనే బీసీసీఐ అతిపెద్ద సంస్థ అని, దాని బాధ్యతలు చూసుకోవడం ముఖ్యం. ఆర్థికపరంగా బీసీసీఐ కీలకమైంది, అలాంటి సంస్థకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం సవాలే" అని గంగూలీ పేర్కొన్నాడు.