ఆసియా కప్లో ఫైనల్కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఈ టోర్నీ సూపర్-4 దశలో వరుసగా రెండు విజయాలతో ముందుగా ఫైనల్ చేరిన భారత్.. చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ బంగ్లా వంటి పసికూన చేతిలో ఓడిపోవడం ఏంటని ఫీలవుతున్నారు.
ఇలాంటి సమయంలో వారికి మరో షాకింగ్ వార్త తెలిసింది. అదేంటంటే.. శ్రీలంకతో జరిగే ఫైనల్లో టీమిండియాకు కీలక ఆటగాడు దూరం అవనున్నాడు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియం వేదికగా సూపర్-4 మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలో స్పిన్నర్లు చెలరేగుతున్నారని మ్యాచ్లు చూసే ప్రతి ఒక్కరికీ తెలుసు.

ఇలాంటి సమయంలో టీమిండియా ప్రధాన స్పిన్నర్లలో ఒకడైన అక్షర్ పటేల్.. ఆసియా కప్ ఫైనల్కు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో మ్యాచులో చివరి వరకు జట్టుకు విజయం అందించేందుకు అక్షర్ పటేల్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతనికి పలు గాయాలయ్యాయి. ఫీల్డర్ వేసిన బంతి అతని ఎడమ చేతికి తగిలింది. దానికి కట్టుకొట్టుకొని అతను ఈ మ్యాచ్లో ఆడాడు.
అంతేకాదు, ఈ మ్యాచులో అతనికి పలుమార్లు గాయాలయ్యాయి. ముందుకొచ్చి భారీ షాట్ ఆడే క్రమంలో కుడిచేతి వేలుకు గాయమైంది. ఆ తర్వాత ఎడం కాలు తొడ ప్రాంతంలో కూడా గాయమైంది. అతనికి ఇన్ని గాయాలవడంతో ఆసియా కప్ ఫైనల్లో అక్షర్ ఆడటం అనుమానంగా మారింది. అయితే స్పిన్కు సహకరించే పిచ్పై మరో స్పిన్నర్ కావాలంటే భారత శిబిరంలో ఎవరూ లేరు.
ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్ను శ్రీలంకకు పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి. అక్షర్ ఆడతాడా? లేదా? అనే విషయంపై అప్పుడే ఏం చెప్పలేమని, మ్యాచ్కు ముందే ఈ విషయం తెలుస్తుందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అలాగే వాషింగ్టన్ సుందర్ ఒకవేళ లంకకు వచ్చినా.. అతనికి తుదిజట్టులో చోటు దక్కడం అనుమానమే అని నిపుణులు అంటున్నారు.