హైదరాబాద్: కేంద్ర క్రీడల మంత్రిగా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ను నియమించడంపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్వాగతించారు. రాజ్యవర్థన్కు ఆ పదవి ఇవ్వడం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని కొనియాడాడు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీపై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.
'ఒక టాప్ స్పోర్ట్స్ పర్సన్కు క్రీడల శాఖ దక్కడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది మోడీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమే కాదు.. గర్వించదగ్గ సమయం కూడా' అని రవిశాస్త్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. కేంద్ర క్రీడల మంత్రి బాధ్యతలు దక్కించుకున్న తొలి క్రీడాకారుడిగా రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ ఘనతకెక్కారు.
ఒక క్రీడాకారుడు ఈ శాఖను దక్కించుకోవడం ఇదే తొలిసారి. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో డబుల్ ట్రాప్ షూటింగ్ విభాగంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ కాంస్య పతకాన్ని సాధించారు. అంతేకాదు కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కూడా ఆయన పలు పతకాలను సాధించారు. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
క్రీడాకారుడైన రాజ్యవర్థన్ సింగ్కు సంబంధిత మంత్రిత్వ శాఖ అప్పగించడంతో దేశంలో క్రీడారంగానికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. రాజ్యవర్దన్ అంటే దేశవ్యాప్తంగా ఆటగాళ్లకు ఎంతో గౌరవం ఉంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో పతకాల సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్న భారత్కు ఇది శుభపరిణామమే.