Shree Charani: మహిళల వరల్డ్ కప్ 2025లో అద్భుతంగా రాణించిన భారత మహిళా స్టార్ క్రికెటర్ శ్రీచరణి ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ఆమెకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు, మంత్రులు అనిత, సవిత, రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్నిలు స్వాగతం పలికారు. శ్రీచరణిని అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్నారు.
విమానాశ్రయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు
ప్రముఖ మహిళా క్రికెటర్ శ్రీ చరణి రాక నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ స్థాయిలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీ చరణికి స్వాగతం పలికేందుకు జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు, యువ క్రీడాకారులు విమానాశ్రయానికి చేరుకున్నారు. వారి ఉత్సాహం విమానాశ్రయం ప్రాంతమంతా కనిపిస్తోంది. విమానాశ్రయంలో మహిళా క్రికెటర్ శ్రీ చరణికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి ఆమె చేసిన కృషికి నిదర్శనంగా ఈ ఏర్పాట్లు చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ
స్టార్ క్రికెటర్ శ్రీ చరణి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిను కలవనున్నారు. ఈ భేటీలో క్రీడల అభివృద్ధి, ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మహిళా క్రికెటర్లకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, శిక్షణా కేంద్రాల ఏర్పాటు, రాష్ట్ర స్థాయి క్రీడల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.