
లండన్: తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ప్రపంచకప్ 2021 పూర్తి షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ యూఏఈకి తరలిపొయింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ మ్యాచులు జరగనున్నాయి. ప్రపంచకప్కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర పోరులు జరగనున్నాయని అందరూ అంచనా వేస్తున్నారు. మరోవైపు పొట్టి కప్ను ఈసారి ఏ జట్టు గెలుస్తుందో మాజీలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఫేవరేట్ జట్టేదో చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ 2021ను భారత్ కంటే వెస్టిండీస్ జట్టే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న విండీస్ పొట్టి కప్ను గెలుస్తుందన్నాడు. ఈసారి టీ20 ప్రపంచకప్ విజేత ఎవరనుకుంటున్నారు అని గ్రేమ్ స్వాన్ను ప్రెజెంటర్ డానిష్ సైట్ అడగ్గా.. 'ఈ టోర్నమెంట్ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో జరిగితే.. కోహ్లీసేననే ఫేవరేట్. కానీ ఇప్పుడు వేదిక మారింది. యూఏఈలో పొట్టి కప్ జరుగుతుంది కాబట్టి.. కచ్చితంగా వెస్టిండీస్ విజేతగా నిలుస్తుంది. విండీస్ నా ఫేవరేట్. విండీస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్లో ఓ పవర్ ఉంది' అని అన్నాడు.
ప్రస్తుతం విండీస్ జట్టులో ఉన్నవారు అందరూ టీ20 ఆటగాళ్లే. విండీస్ బోర్డు ఇచ్చే వేతనాలు తక్కువ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు లీగుల్లో ఆడాడనికి కరేబియన్ ప్లేయర్స్ ఆసక్తిచూపిస్తారు. అంతర్జాతీయ జట్టుకు కాకుండా కేవలం ప్రైవేట్ లీగుల్లో ఆడుతున్న ప్లేయర్స్ కూడా వారికి అందుబాటులో ఉన్నారు. అందుకే టీ20 ఫార్మాట్లో విండీస్ పటిష్టంగా ఉంటుంది. క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్ మరియు కిరోన్ పోలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. ఇందులో పూరన్ మినహా మిగతావారందరూ గత రెండు ప్రపంచకప్లు గెలిచిన జట్టులోని సభ్యులే. 2012, 2016 ప్రపంచకప్లను విండీస్ గెలుచుకుంది. ఇప్పుడు మూడో టోర్నీపై కన్నేసింది.
టీ20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తాజాగా పేర్కొన్నాడు. 'జోష్ ఇంగ్లిష్ జట్టులో చోటు దక్కించుకోవడం అద్భుతంగా ఉంది. అతడు సరదాగా పరుగులు చేస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ బాగుంది. సీనియర్లు కీలక పాత్ర పోషిస్తారు. టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా ఈ జట్టుకు ఉందని భావిస్తున్నా' అని పాంటింగ్ ట్వీట్ చేశాడు. వన్డే ప్రపంచకప్లో తిరుగులేని అధిపత్యం ప్రదర్శిస్తూ.. ఐదుసార్లు విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. కానీ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ని ఒక్కసారి కూడా ఆసీస్ ముద్దాడలేదు. ఈసారి అయినా ఆ కలను నెరవేర్చుకోవాలని ఫించ్ సేన చూస్తోంది.
టీ20 ప్రపంచకప్లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా, పాపువా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్లకి అర్హత సాధించనున్నాయి. ఇక విండీస్ తన మొదటి మ్యాచ్ని అక్టోబరు 23న ఇంగ్లండ్ జట్టుతో ఆడనుంది. 26న దక్షిణాఫ్రికా, నవంబరు 6న ఆస్ట్రేలియాతో తలపడనుంది. క్వాలిఫయర్స్ నుంచి సూపర్-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ని విండీస్ ఆడనుంది.