
హైదరాబాద్: కెప్టెన్సీకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పనికొస్తాడా అంటూ దక్షిణాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. స్వదేశంలో జరిగిన అన్ని మ్యాచ్లలోనూ విజయం ఎలా సాధించగలిగారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అక్కడ బాగా రాణించిన కోహ్లీ సేన విదేశాల్లో అదే స్థాయిలో ఎందుకు రాణించలేకపోతోందని ప్రశ్నించాడు.
ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన కోహ్లీసేనపై ఉన్న అభిప్రాయాలను వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో స్మిత్ తన అభిప్రాయాలను సునీల్ గవాస్కర్ సమక్షంలోనే బయటపెట్టాడు.
'అతన్ని చూస్తుంటే నాకెందుకో అలా అనిపించట్లేదు. కోహ్లీ ఎక్కువకాలం కెప్టెన్సీకి పనికిరాడేమో అన్నట్లు ఉంది. గతేడాది చివర్లో కోహ్లీ జట్టు నుంచి విరామం తీసుకుని బయటికెళ్లాడు. స్వదేశంలో జరిగిన మ్యాచ్లలో దాదాపు అన్నింటిలోనూ కోహ్లీ సేన విజయం వైపుకు దూసుకుపోయింది. మరి విదేశీ పర్యటనల్లో అలా ఎందుకు జరగట్లేదు. లేకపోతే స్వదేశంలోనే వారికి కోహ్లీ మంచి నాయకుడిగా కనిపిస్తున్నాడా' అంటూ ప్రశ్నించాడు.
'కోహ్లీని చూస్తుంటే, జట్టు సహాయక బృందంలో ఎవరైనా ఒకరు నిర్మాణాత్మకంగా సవాల్ చేస్తూ అతడు ఎదిగేందుకు సాయం చేయాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. వ్యూహాత్మకంగా కోహ్లీకి అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. తన ఆట గురించి బాగా తెలుసు. మైదానంలో అతడు అందరికీ ప్రమాణాలు నిర్దేశించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీతో మాట్లాడే, సవాల్ చేయగలిగే, వినూత్న ఆలోచనలతో ఆలోచింపగలిగే నిర్మాణాత్మక వ్యక్తి దొరికితే అతడు మంచి నాయకుడు అవుతాడు. ఇలాగే దూకుడుగా, కోపంగా ఉంటే మాత్రం చాలా కష్టం' అని స్మిత్ అన్నాడు.
అంతేకాదు కోహ్లీని భారతదేశం వాళ్లే విమర్శించడం ఏం బాగాలేదని స్మిత్ అన్నాడు. 'కోహ్లీ మంచి ప్లేయర్. ఫీల్డింగ్ను కూడా బాగా రాణించగలడు. అతను ఓ ప్రత్యేకమైన ఆటతీరు కలవాడు. ఆటపై ఓ ఏకాగ్రతతో ఆడగల వ్యక్తిని ఇలా అనడం సబబు కాదు' అని స్మిత్ చెప్పుకొచ్చాడు.
కొన్నిసార్లు కెప్టెన్గా వ్యవహరించిన తీరును బట్టే తోటి క్రీడాకారుల ఆట ప్రతిబింబిస్తూ ఉంటుంది. కోహ్లీ కెప్టెన్గా కూడా ఇంకా ఎదగాల్సి ఉందని, ఆట మీద దృష్టి పెడుతూనే నాయకత్వంపై కూడా మరింత నైపుణ్యం ప్రదర్శించాల్సి ఉందని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.