
హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాత్కాలిక డైరెక్టర్గా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిసే వరకు అతడు తన పదవిలో కొనసాగనున్నాడు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెట్ సీఈఓ జాక్వస్ ఫాల్ మాట్లాడుతూ స్మిత్ ఈ బాధ్యతలను స్వీకరించడం సంతోషంగా ఉందని అన్నారు.
ఇక, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాత్కాలిక డైరెక్టర్గా నియమితుడవ్వడంపై గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ "ఈ విషయాన్ని గతంలో కూడా ఎన్నో సార్లు బహిరంగంగానే చెప్పాను. ఇప్పటికీ దక్షిణాఫ్రికా క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం. దక్షిణాఫ్రికా క్రికెట్ను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తా" అని తెలిపాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొంత కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పూర్తిగా బలహీనంగా మారింది. సీనియర్ ఆటగాళ్లు దూరమవ్వడం, సరైన ఆటగాళ్లు జట్టుకు దొరకకపోవడం, సమర్ధ బోర్డు మెంబెర్స్ లేకపోవడంతో పోరాట పటిమ చూపలేకపోతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా క్రికెట్ను అభివృద్ధి పథంలో నడిపిస్తాడని అంతా భావిస్తున్నారు. డిసెంబర్ 26న ఇంగ్లాండ్తో జరగనున్న తొలి టెస్టులోపు స్మిత్ కొత్త సెలక్షన్ ప్యానెల్తో పాటు కోచింగ్ సిబ్బందిని ఎంపిక చేయాల్సి ఉంది.
కాగా, దక్షిణాఫ్రికా జట్టు బలహీనంగా మారడంతో పీటర్సన్ ట్విట్టర్ వేదికగా ఓ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు బోర్డు డైరెక్టర్గా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, హెడ్ కోచ్గా వికెట్ కీపర్ మార్క్ బౌచర్, బౌలింగ్ కోచ్గా పేసర్ మఖాయ ఎన్తినీ, స్పిన్ కోచ్గా ఆల్రౌండర్ రాబిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా క్రికెట్ సీఈవో మరియు జట్టు కన్సల్టెంట్గా ఆల్రౌండర్ జాక్వస్ కలిస్ బాధ్యతలు చేపట్టాలని పీటర్సన్ ట్వీట్ చేశాడు.
వీరందరూ బాధ్యతలు చేపడితే దక్షిణాఫ్రికా క్రికెట్ పూర్వవైభవాన్ని అందుకుంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు దక్షిణాఫ్రికా తరఫున 117 టెస్టులు, 197 వన్డేలు, 33 టీ20లు ఆడిన స్మిత్ 17వేల పరుగులు పైగా సాధించాడు. కెప్టెన్గా గ్రేమ్ స్మిత్ సఫారీ జట్టుకు అనేక అద్భుతమైన విజయాలనందించాడు.