Asia Cup 2025: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. టీ20 ఫార్మాట్లో భారత జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ అయిన సూర్య కుమార్ యాదవ్ ఇటీవల గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కారణంగా కొంతకాలంగా క్రికెట్కు దూరంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తిరిగి నెట్స్లో బ్యాటింగ్ సాధన ప్రారంభించాడు. ఈ పరిణామంతో సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే భారత జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జూన్లో తన స్పోర్ట్స్ హెర్నియా గాయానికి సూర్యకుమార్ యాదవ్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ గాయంపై సలహా కోసం సూర్యకుమార్ యాదవ్ జర్మనీకి వెళ్లి, జూన్ 25న అక్కడ సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత ఇండియాకు వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫిట్నెస్ పరీక్షలు, రిహాబిలిటేషన్ ప్రక్రియలో ఉన్నాడు. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తున్న ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "నాకు ఇష్టమైన పనిని మళ్లీ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు.

రాబోయే ఆసియా కప్.. సూర్య పాత్ర
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఈ టోర్నమెంట్లో భారత జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాలి. సూర్య ప్రాక్టీస్ ప్రారంభించడంతో ఆసియా కప్లో అతని భాగస్వామ్యంపై ఆశలు చిగురించాయి. ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు సెప్టెంబర్ 14న దుబాయ్లో తలపడనున్నాయి. సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాడి రాక టీమిండియాకు బలాన్ని ఇస్తుంది.
సూర్య కుమార్ యాదవ్కు ఇది రెండో సర్జరీ
ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఈ స్టార్ బ్యాటర్కు స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరగడం ఇది రెండోసారి. గతంలో 2024 జనవరిలో కూడా అతనికి ఇదే సర్జరీ జరిగింది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో అతను ఆసియా కప్లో ఆడేందుకు ఎంతవరకు ఫిట్గా ఉంటాడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.