రంజీ ట్రోఫీ-2024లో ఆల్టైమ్ రికార్డు నమోదైంది. గోవా కుర్రాళ్లు స్నేహల్ కౌతంకర్, కశ్యప్ బక్లే ట్రిపుల్ సెంచరీలతో చెలరేగి దేశవాళీ క్రికెట్లో కనీవిని ఎరుగని రికార్డు సృష్టించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగవంతమైన 300 పరుగుల మార్క్ను అందుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అంతేగాక రంజీ ట్రోఫీలో ఏ వికెట్ పరంగా అయినా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ప్రపంచ క్రికెట్లోనూ పలు రికార్డు బ్రేక్ చేశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రెండో జోడీగా రికార్డు నెలకొల్పాడు. కుమార్ సంగక్కర-మహేలా జయవర్ధనె ద్వయం (624) తర్వాతి స్థానంలో నిలిచారు. అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ అరుదైన ఘనతలు సాధించారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్.. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (5/25) 84 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం బ్యాటింగ్కు వచ్చిన గోవా 92 ఓవర్లలో 727/2 స్కోరు వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. స్నేహల్ కౌతంకర్ (314 నాటౌట్; 215 బంతుల్లో, 45 ఫోర్లు, 4 సిక్సర్లు), కశ్యప్ బక్లే (300 నాటౌట్; 269 బంతుల్లో, 39 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ ట్రిపుల్ సెంచరీలతో కదం తొక్కారు. మూడో వికెట్కు అబేధ్యమైన 606 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 146 బంతుల్లో ద్విశతకం బాదిన స్నేహల్ కౌతంకర్ 205 బంతుల్లో 300 మార్క్ అందుకున్నాడు. కశ్యప్ 269 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
రంజీ ట్రోఫీలో అత్యధిక భాగస్వామ్య రికార్డులు
స్నేహల్ కౌతంకర్ - కశ్యప్ బక్లే (గోవా): 606* పరుగులు (2024/25) వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్
స్వప్పిల్ సుగాలే- అంకిత్ బవానే (మహారాష్ట్ర): 594* పరుగులు (2014/17) వర్సెస్ ఢిల్లీ
విజయ్ హజారె- గుల్ మహ్మద్ (బరోడా): 577 పరుగులు (1946/47) వర్సెస్ హోల్కర్.