దేశవాళీ క్రికెట్లో ముంబయి జట్టును వీడి షాకిచ్చాడు యశస్వి జైస్వాల్. అకస్మాతుగా అతడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అని క్రికెట్ అభిమానుల్లో ఒకటే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా యశస్వి.. తాను ముంబయిని వీడటానికి గల కారణమేమిటనేది వివరించాడు. టీమిండియా మ్యాచులు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
అందుకే ముంబయిని వదిలేశా...
గోవా జట్టు నుంచి తనకు మంచి ఆఫర్ వచ్చిందని తెలిపాడు యశస్వి జైశ్వాల్. అందుకే తాను ముంబయి జట్టు వీడినట్లు వివరించాడు. "ఈ నిర్ణయం తీసుకోవడం నాకు ఎంతో కష్టమైనది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి అసలు కారణం ముంబయి. ఈ ముంబయి నగరమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నా జీవితాంతం ముంబయి క్రికెట్ అసోసియేషన్కు రుణపడి ఉంటాను. గోవా నాకు ఓ కొత్త అవకాశాన్ని ఇచ్చింది. నాయకత్వ బాధ్యతలను తీసుకోవాలని కోరింది. అయితే, నా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ టీమిండియానే. జాతీయ జట్టు తరఫున మ్యాచులు ఆడనప్పుడు మాత్రం గోవాకు ఆడతాను. అవసరమైతే టోర్నీ మొత్తం ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఇది నాకు వచ్చిన ముఖ్యమైన అవకాశం. దీనిని నేను బాధ్యతతో స్వీకరించాను" అని జైస్వాల్ పేర్కొన్నాడు.

అవన్నీ రూమర్లే
యశస్వి జైస్వాల్ లానే సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబయి జట్టు నుంచి బయటకు వస్తాడని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా వాటిపై సూర్య కుమార్ స్పందించాడు. ఇవన్నీ అవాస్తమని కొట్టిపారేశాడు. ఎవరూ నమ్మకండి అని చెప్పుకొచ్చాడు.
కాగా, అంతర్జాతీయ మ్యాచులు లేనప్పుడు, లేదా అందులో భాగం కానప్పుడు.. టీమిండియా క్రికెటర్లు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ లో ఆడాలని ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ. ఈ జనవరిలో జమ్మూకశ్మీర్తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో చివరిసారిగా ముంబయి తరఫున ఆడాడు యశస్వి. ఈ మ్యాచులో 4, 26 పరుగులు చేశాడు. ఇకపోతే యశస్వి కన్నా ముందు అర్జున్ తెందుల్కర్, సిద్ధేష్ లాడ్ కూడా ముంబయి జట్టు నుంచి గోవా జట్టులోకి వెళ్లిన సంగతి తెలిసిందే.