డేవిడ్ వార్నర్ బ్యాగీ గ్రీన్ క్యాప్ కోసం దేశమంతా గాలించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ కోరాడు. టెస్టులతో పాటు వన్డేలకు కూడా వార్నర్ గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ వార్నర్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు. ఎంతో గౌరవంగా భావించే తన బ్యాగీ గ్రీన్ క్యాప్
పోయిందని, తన బ్యాగ్ మిస్ అయ్యిందని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్తో జరిగిన రెండో టెస్టు ముగిసిన అనంతరం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి వస్తున్న దారిలో అది మిస్ అయి ఉంటుందని వార్నర్ భావిస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలించినా బ్యాగ్ ఆచూకి దొరకలేదని వార్నర్ వివరించాడు. ''నా లగేజ్ నుంచి నా బ్యాక్పాక్ను ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయి. అలాగే నా బ్యాగీ గ్రీన్ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. తిరిగి అది పొందాలనుకుంటున్నా. మీకు బ్యాక్పాక్ కావాలనుకుంటే నేను మరో బ్యాక్పాక్ ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి ఇబ్బంది కలుగజేయను. నా బ్యాగీ గ్రీన్ తిరిగిఇస్తే ఎంతో ఆనందిస్తా'' అని వార్నర్ అన్నాడు.

టెస్టు అరంగేట్రంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాగీ గ్రీన్ క్యాప్ను పొందుతారు. దాన్ని వారు ఎంతో గౌరవంగా భావిస్తారు. అలాంటి బ్యాగీ గ్రీన్ను తన చివరి టెస్టు ముందు కనిపించకపోవడంతో వార్నర్ తట్టుకోలేకపోతున్నాడు. సిడ్నీ వేదికగా రేపటి నుంచి పాకిస్థాన్తో ప్రారంభమయ్యే టెస్టు వార్నర్కు ఆఖరిది. కాగా, ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ స్పందించాడు.
''ఆస్ట్రేలియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టాలి. అత్యుత్తమ డిటిక్టెవ్ ఆఫీసర్లను రంగంలోకి దించాలి. వార్నర్ గొప్ప ఆటగాడు. అతడి అసాధారణ క్రికెట్ కెరీర్ ఆఖర్లో వార్నర్ సరైన గౌరవం పొందాలి. బ్యాగీ గ్రీన్ క్యాప్ వార్నర్కు తిరిగి దొరుకుతుందని ఆశిస్తున్నా. ప్రతి క్రికెటర్కు అది ఎంతో విలువైనది'' అని మసూద్ అన్నాడు. మూడు టెస్టుల సిరీస్ కోసం పాకిస్థాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలై సిరీస్ను కోల్పోయింది. రేపటి నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది.