హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తొలి టీ20లో అద్భుతంగా రాణించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు, ప్రస్తుతమున్న టీమిండియా ప్రపంచవ్యాప్తంగా ఏ జట్టునైనా ఓడించేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్తో ఆదివారం ముగిసిన మూడు టీ20ల సిరీస్ని భారత్ 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
తొలి టీ20లో గెలిచిన భారత జట్టు.. రెండో టీ20లో ఓడినా.. మళ్లీ మూడో టీ20లో పుంజుకున్న తీరు అమోఘమని గంగూలీ కొనియాడాడు. గురువారం నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. ప్రముఖ ఇంగ్లీషు మీడియాకి వ్యాసం రాశాడు.
'ఇంగ్లాండ్ పర్యటనలో ఎలాంటి ఆరంభం అవసరమో..? అలాంటి సిరీస్ విజయాన్నే భారత్ అందుకుంది. రెండో టీ20లో ఓడినా.. చివరి ఓవర్ వరకూ పోరాడిన తీరు నన్ను ఆకట్టుకుంది. ఆ పోరాట పటిమ గురువారం నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్లోనూ కొనసాగుతుందని నా అంచనా. సిరీస్లో ఇంగ్లాండ్ కొన్ని సందర్భాల్లో ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేసింది. కానీ.. కోహ్లిసేన మళ్లీ పుంజుకుని వారికి గట్టి పోటీనిచ్చింది.'
'ఇప్పుడు పర్యటనలో ఉన్న జట్టుని చూస్తుంటే.. ఏ జట్టుపైనైనా పరిమిత ఓవర్ల క్రికెట్లో గెలవగలదని అనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఇంగ్లాండ్ గడ్డపై వేడి పెరిగింది. ఇది భారత స్పిన్నర్లకి లాభించే అంశమే ' అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.