న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్టులో ఓటమిపాలైన దక్షిణాఫ్రికా రెండో టెస్టులో అంత సులువుగా లొంగిపోవట్లేదు. అనుభవం లేని యువ జట్టు అయిన సౌతాఫ్రికా.. కివీస్పై గొప్పగా పోరాడుతోంది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో మూడో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. విజయానికి 227 పరుగుల దూరంలో నిలిచింది.
తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 242 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 211 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. అయితే గురువారం ఆటలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 235 పరుగులకు ఆలౌటైంది. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును కెప్టెన్ నీల్ బ్రాండ్ (34; 60 బంతుల్లో) కలిసి బెడింగ్హమ్ (110; 141 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ కుదురుకున్న బ్రాండ్ను విలియమ్ ఒరోర్కే పెవిలియన్కు చేర్చాడు.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన పీటర్సన్ (43; 79 బంతుల్లో)తో కలిసి బెడింగ్హమ్ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరు సాధికారంగా బ్యాటింగ్ చేస్తూ న్యూజిలాండ్పై ఆధిపత్యం చెలాయించారు. కానీ గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్తో కివీస్ తిరిగి పోటీలోకి వచ్చింది. 202/4తో పటిష్ట స్థితిలో ఉన్న సౌతాఫ్రికా 235 పరుగులకే ఆలౌటైంది. ఫిలిప్స్ క్యాచ్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది.
మ్యాట్ హెన్రీ బౌలింగ్లో పీటర్సన్ బౌండరీ సాధించాలని కట్ షాట్ ఆడాడు. కానీ గల్లీలో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ రెప్పపాటులో పక్షిలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ను అందుకున్నాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు చేరి ఆలౌటయ్యారు. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన న్యూజిలాండ్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (21*), కాన్వే (17) తొలివికెట్కు 40 పరుగులు జోడించారు. అయితే కాన్వేనే పీడ్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.