
భారత్తో జరిగే వన్డే సిరీసులో పునరాగమనం చేసేందుకు ఆసీస్ స్టార్ ప్లేయర్ రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని ఆసీస్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా బిగ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే.. స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లిన అతను అక్కడ కింద పడటంతో కాలి ఎముక విరిగింది. ఈ గాయంతో ఆస్పత్రిపాలైన అతను ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆడిన సిరీసులకు దూరమయ్యాడు.
భారత్తో జరుగుతున్న టెస్టు సిరీసులో కూడా అతను ఆడాల్సింది. కానీ ఈ గాయం కారణంగానే ఈ సిరీస్కు కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కోలుకున్న అతను షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని చేతికి గాయమైంది. అయితే ఇది అంత పెద్ద గాయం కాదని సమాచారం. ఈ క్రమంలోనే ఆండ్రూ మెక్డొనాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఆడితే మ్యాక్స్వెల్పై విపరీతమైన ఒత్తిడి పడుతుందని మెక్డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. అయితే ఫిట్నెస్ సాధిస్తే మాత్రం అతన్ని భారత్తో వన్డేల్లో కచ్చితంగా ఆడిస్తామని తేల్చిచెప్పాడు.
'మ్యాక్స్వెల్ అన్ని రకాలుగా సిద్ధమైతే భారత్తో జరిగే వన్డేల్లో అతను కచ్చితంగా ఆడతాడు' అని ఆస్ట్రేలియా కోచ్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా.. గాయం నుంచి కోలుకొని మళ్లీ క్రికెట్ ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మ్యాక్స్వెల్ చెప్పాడు. 'మూడున్నర నెలలపైగా ఆటకు దూరమయ్యా. జిమ్, రీహాబ్, పూల్ సెషన్లు, ఫిజియో అన్నీ చేసి మళ్లీ క్రికెట్ ఆడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది' అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. భారత్తో టెస్టు సిరీస్కు దూరమవడం తనను చాలా బాధించిందని చెప్పాడు. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు తొలి రెండు టెస్టుల్లోనూ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే.