ఐపీఎల్ వరకైతే ఓకే:
అభిమానులు లేకుండా ఐపీఎల్ను జరిపించవచ్చు కానీ.. అలా టీ20 ప్రపంచకప్ను నిర్వహించడం సాధ్యం కాదని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అన్నాడు. 'ప్రేక్షకుల లేకుండా మ్యాచ్లు సాగడం ఎంతో కష్టతరం. అయితే స్టేడియంలో ప్రజలు లేకుండా ఐపీఎల్ను నిర్వహించొచ్చు. కానీ.. అలా టీ20 ప్రపంచకప్ను నిర్వహించడం నేను చూడలేను. మెగాటోర్నీకి అభిమానులు లేకుండా ఏర్పాటు చేయడం సరికాదు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే సమర్థించను. ప్రజలు శ్రేయస్సు, ఆరోగ్యం ముఖ్యం' అని మాక్స్వెల్ పేర్కొన్నాడు.
ప్రపంచకప్పై సందేహాలు:
రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్పై కూడా సందేహాలు మొదలవుతున్నాయి. అయితే ప్రపంచకప్ను ఐసీసీ వాయిదా వేస్తే.. అక్టోబర్-నవంబర్లో ఐపీఎల్ నిర్వహించాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. కేంద్రం లాక్డౌన్ను పొడిగించే యోచనలో ఉండడంతో ఐపీఎల్ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై బీసీసీఐ చర్చలు జరుపుతోంది. అయితే, కేంద్రం నిర్ణయంపై వేచి చూస్తున్నామనీ.. ఆ తర్వాతే ఐపీఎల్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించాడు.
వేలంలో భారీ ధర:
గతేడాది చివరలో జరిగిన ఐపీఎల్ వేలంలో మాక్స్వెల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కోనుగోలు చేసింది. మ్యాక్సీ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. పలు ఫ్రాంఛైజీలు అతన్ని కొనుక్కోవడానికి పోటీపడ్డాయి. చివరకు భారీ మొత్తంకు పంజాబ్ దక్కించుకుంది. మోచేతి గాయం కారణంగా గత కొద్దిరోజులుగా క్రికెట్కి దూరంగా ఉంటున్న మాక్స్వెల్.. ఐపీఎల్ 2020 సీజన్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
110 వన్డేలు.. 61 టీ20లు:
మ్యాక్స్వెల్ ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో ఆసీస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు కూడా ఆడాడు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్వెల్ 2,877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 61 టీ20లు ఆడి 1,576 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.