సిడ్నీ: భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీపై తాను చేసినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్పష్టం చేశాడు. కాన్బెర్రాలో జరిగిన వన్డే మ్యాచులో సెంచరీ చేయడానికి విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో వేగం తగ్గించడాని మాక్స్ వెల్ అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై మాక్స్వెల్ మండిపడ్డాడు.
బ్యాటింగ్లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తున్నారని తనను అడిగితే ఈ సమయంలో విరాట్ కోహ్లీ కన్నా ఉత్తమంగా బంతిని కొడుతున్నవారు లేరని తాను అనుకుంటున్నట్లు చెప్పానని ఆయన వివరణ ఇచ్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్తో ఆయన శుక్రవారంనాడు ఆ వివరణ ఇచ్చాడు.
మైదానం వెలుపల కోహ్లీకి, తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పాడు. కాన్బెర్రాలో సెంచరీ చేసిన కోహ్లీని అభినందిస్తూ తాను ట్వీట్ కూడా చేసినట్లు తెలిపాడు. విరాట్ కోహ్లీ ఆడుతున్న సమయంలో మ్యాచ్ తమ చేతిని జారిపోతున్నట్లు అనిపించినా తాము ఏమీ చేయలేకపోయామని అన్నాడు.
క్రికెట్ క్రీడలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒక్కడైన విరాట్ కోహ్లీపై తాను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయని, వాటిలో ఏ మాత్రం నిజం లేదని అన్నాడు. లక్ష్యఛేదన సమీపిస్తున్న తరుణంలో భారత్ పరుగుల వేగం మందగించిందని మాత్రమే తాను అన్నట్లు చెప్పాడు.