రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, అన్క్యాప్డ్ ప్లేయర్ యశ్ దయాల్ను అట్టిపెట్టుకుంది. కెప్టెన్ డుప్లెసిస్, విధ్వంసకర ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్తో సహా మిగిలిన అందరి ప్లేయర్లను వదులుకుంది. అయితే 2021 నుంచి కొనసాగుతున్న తనని ఆర్సీబీ ఫ్రాంచైజీ వదిలేయడానికి గల కారణాలను ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాక్స్వెల్ వివరించాడు.
తనని రిలీజ్ చేసే ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ సుదీర్ఘంగా చర్చించిందని మ్యాక్స్వెల్ తెలిపాడు. ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, డైరెక్టర్ ఆప్ క్రికెట్ మో బోబాట్ తనతో అరగంటకు పైగా మాట్లాడి ఫ్రాంచైజీ ప్రణాళికలు వివరించారని మ్యాక్సీ చెప్పాడు. జట్టును బలోపేతం చేసి, మంచి ఫలితాలు రాబట్టే వ్యూహాల్లో భాగంగా తనని వదులుకుంటున్నట్లు వాళ్లు తెలిపారని అన్నాడు. ఇక ఆర్సీబీ ఫ్రాంచైజీ సిబ్బందిలో కూడా కొన్ని మార్పులు చేస్తోందని, ఈ నేపథ్యంలో ఆటగాళ్లను స్పష్టంగా రిటైన్ చేసుకోలేదని చెప్పాడు.

ముగ్గురు ప్లేయర్లతో కోర్ టీమ్ను కాపాడుకుంటూ విదేశీ ప్లేయర్లు, స్వదేశీ ప్లేయర్లు తీసుకోవాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్ణయించుకుందని మ్యాక్స్వెల్ అన్నాడు. ఈ క్రమంలో తాను సంతోషకరంగా ఫ్రాంచైజీ నుంచి రిలీజ్ అయ్యానని తెలిపాడు. అయితే ఆర్సీబీతో తన బంధం ముగిసిపోలేదని, బెంగళూరు ఫ్రాంచైజీలోకి తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నానని మాక్సీ చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాక్సీ పేలవ ప్రదర్శన చేశాడు. 5.77 సగటుతో 52 పరుగులే చేశాడు.
కాగా, ఆర్సీబీ తన పర్స్ వ్యాల్యూలో రిటైన్ కోసం రూ. 37 కోట్లు ఖర్చు పెట్టింది. మిగిలిన రూ.83 కోట్లతో వేలంలో పాల్గొననుంది. నిబంధనల ప్రకారం ఓ జట్టు గరిష్టంగా 25 మందిని ఉంచుకోగలదు. దీని ప్రకారం ఆర్సీబీ తన వద్ద మిగిలిన మొత్తంతో 22 మందిని సొంతం చేసుకోవాల్సి ఉంది. అందులో 8 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది. అయితే ఆర్సీబీ వద్ద మూడు ఆర్టీఎమ్ కార్డ్స్ ఉన్నాయి. దీంతో వదులుకున్న ఆటగాళ్లలో మహ్మద్ సిరాజ్, డుప్లెసిస్, మ్యాక్సీ లేదా విల్ జాక్స్ను ఆర్టీఎమ్తో తిరిగి ఆర్సీబీ సొంతం చేసుకునే అవకాశం ఉంది.