రెండు వారాలు దూరం:
బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2019-20 సమయంలో మ్యాక్స్వెల్ ఎడమ మోచేయికి గాయం అయింది. ఈ గాయానికి మ్యాక్సీ శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాడు. మెల్బోర్న్లో గురువారం మోచేయికి శస్త్రచికిత్స చేయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే శస్త్రచికిత్స అనంతరం అతడు కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది. ఐపీఎల్ 2020 మార్చి చివరి వారంలో మొదలయ్యే అవకాశం ఉండడంతో.. టోర్నీ ప్రారంభ రెండు వారాలకు మ్యాక్సీ దూరం కానున్నాడు.
వేలంలో భారీ ధర:
గతేడాది చివరలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.10.75 కోట్లకు కోనుగోలు చేసింది. మ్యాక్సీ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. పలు ఫ్రాంఛైజీలు అతన్ని కొనుక్కోవడానికి పోటీపడ్డాయి. చివరకు భారీ మొత్తంకు పంజాబ్ దక్కించుకుంది. మోచేతి గాయం కారణంగా మ్యాక్స్వెల్ రెండు వారాల పాటు ఐపీఎల్కు దూరం కానుండడంతో పంజాబ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
10 వన్డేలు.. 61 టీ20లు:
బీబీఎల్ టోర్నీకి ముందు మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్ నుంచి మాక్స్వెల్ స్వల్ప విరామం తీసుకున్న విషయం తెలిసిందే. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్ జరుగుతుండగానే అర్ధంతరంగా తప్పుకున్నాడు. మ్యాక్స్వెల్ ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో ఆసీస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు కూడా ఆడాడు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్వెల్ 2,877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 61 టీ20లు ఆడి 1,576 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఆర్చర్ ఔట్:
ఐపీఎల్కు ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయం కారణంగా సీజన్-13 దూరమయ్యాడు. 2018లో ఐపీఎల్కు ఎంపికైన ఆర్చర్.. గత రెండు సీజన్లలో కలిసి 26 వికెట్లు తీశాడు. మోచేయి గాయం కారణంగా ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు.