Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ చేతిలో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. భారత్ చేతిలో సెమీఫైనల్ లో ఓటమితో ఆస్ట్రేలియా దిగ్భ్రాంతి గురైంది. ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే సెమీ-ఫైనల్స్లో ఓటమి బాధ ఆస్ట్రేలియా కంటే పాకిస్థాన్ మీడియాలోనే ఎక్కువగా కనిపించింది. భారత జట్టు ఆస్ట్రేలియాపై విజయం సాధించిన అనంతరం.. ఆసీస్ ఆటగాళ్లు కావాలనే బాగా ఆడలేదని పాకిస్థాన్ మీడియాలో చర్చ ప్రారంభమైంది.
సోషల్ మీడియాలో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ-ఫైనల్ తర్వాత పాకిస్థాన్ టీవీ ఛానెల్ లో చర్చ జరుగుతోంది. ఆ టీవీ ఛానెల్ చర్చలో ఒక ప్యానలిస్ట్ ఓటమికి గ్లెన్ మ్యాక్స్వెల్ను నిందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కాంట్రాక్టు పొందడానికి గ్లెన్ మ్యాక్స్వెల్ భారత్ తో జరిగిన కీలకమైన మ్యాచ్ లో పేలవంగా ఆడాడని ఆ ప్యానలిస్ట్ మాట్లాడడం గమనార్హం.

మ్యాక్స్వెల్ పేలవంగా ఆడాడని ఆరోపణలు
ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన గురించి చర్చిస్తున్నప్పుడు ఓ ప్యానలిస్ట్ ఇలా అన్నాడు. "గ్లెన్ మ్యాక్స్వెల్ ని చూస్తుంటే అతను కోహ్లీ జట్టు తరపున ఆడుతున్నట్లు అనిపించింది. స్మిత్, అలెక్స్ కేరీ నుంచి మ్యాక్స్వెల్ కు మంచి ప్లాట్ఫామ్ లభించింది. ఆస్ట్రేలియాను 300 పరుగులకు తీసుకెళ్లే అవకాశం మ్యాక్స్వెల్ కు లభించింది. కానీ అతను అన్నింటిని చెడగొట్టాడు. దీంతో పాటు విరాట్ కోహ్లీ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను కూడా జారవిడిచాడు. మ్యాక్స్వెల్ భారత్ తో ఆడటం నేనెప్పుడూ చూడలేదు." అని పాక్ టీవీ ఛానల్ లో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
మ్యాచ్ గురించి చెప్పాలంటే.. భారత్ తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ అర్ధ సెంచరీతో కేవలం 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేదనకు దిగిన టీమిండియా 48.1 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 267 పరుగులు చేసి మ్యాచ్ ను గెలుచుకుంది.