
హైదరాబాద్: మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసినప్పటికీ... దానిని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. అయితే, టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే.
మ్యాచ్ను ఆస్ట్రేలియా వైపు లాగేసుకున్న ఆస్టన్ టర్నర్ను స్టంపింగ్ చేసే విషయంలో భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన పొరపాటు కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణం. ఆస్టన్ టర్నర్ను రెండు సార్లు స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా రిషభ్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ధోనీలా రనౌట్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో మైదానంలో కొందరు అభిమానులు 'ధోనీని తిరిగి తీసుకురండి' అని నినాదాలు కూడా చేశారు. మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో సైతం రిషభ్ పంత్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో పంత్కు బాలీవుడ్ నటుడు సునిల్శెట్టి అండగా నిలిచాడు.
పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న పంత్ను ధోనితో పోల్చడం సరికాదని అంటున్నారు. "21 ఏళ్ల వయసుకే భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో పంత్ ఆడుతున్నాడు. అతనొక యువ క్రికెటర్. అతని వయసులో మనం ఏం చేశామో ఒక్కసారి పరిశీలించుకుందాం. అతనికి ఒక అవకాశం ఇవ్వండి. పంత్లో టాలెంట్ ఉంది. విమర్శలను పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టమని పంత్ను కోరుతున్నా" అని సునీల్ శెట్టి ట్వీట్ చేశాడు.