జింబాబ్వే పర్యటనలో యువకులతో నిండిన భారత జట్టును నడిపిస్తున్న శుభ్మన్ గిల్ కెప్టెన్గా తొలి విజయాన్ని అందుకున్నాడు. హరారె వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 234 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. శుభ్మన్ గిల్ (77 నాటౌట్; 47 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్), రింకూ సింగ్ (48 నాటౌట్; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) సత్తాచాటారు. అనంతరం ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ వెస్లీ మధెవెర్ (43; 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్ (3/37), అవేశ్ ఖాన్ (3/15) చెరో మూడు వికెట్లతో విజృంభించారు.

అయితే జింబాబ్వేతో జరుగుతున్న అయిదు టీ20ల సిరీస్లో మూడో టీ20 నుంచి శివమ్ దూబె, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ జట్టుతో చేరనున్నారు. ఈ ముగ్గురుని మొదట అయిదు టీ20లకు ఎంపిక చేశారు. కానీ టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో ఉన్న ఈ ప్లేయర్లు వెస్టిండీస్లో తుఫాను కారణంగా ఆలస్యంగా స్వదేశానికి వచ్చారు. దీంతో వరుస ప్రయాణాల దృష్ట్యా తొలి రెండు టీ20లకు విశ్రాంతి ఇచ్చారు. మూడో టీ20 నుంచి అందుబాటులోకి రానున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు జింబాబ్వేకు కూడా చేరుకున్నారని సమాచారం.
ఈ ముగ్గురు రాకతో భారత తుదిజట్టు కూర్పు మారనుంది. అయితే తొలి టీ20లో ఓడి, గొప్పగా పుంజుకుని రెండో మ్యాచ్లో విజయం సాధించిన జట్టు కాంబినేషన్ను మార్చడం కెప్టెన్గా శుభ్మన్ గిల్కు కఠిన సవాలుగా మారనుంది. దీని గురించి రెండో టీ20 మ్యాచ్ అనంతరం గిల్ స్పందించాడు. ఇది మంచి తలనొప్పే అని అన్నాడు. ఆటగాళ్లను ఎంపిక చేసే ఆప్షన్లు లేకపోవడటం కంటే, ఎక్కువ ఆప్షన్లు ఉండటమే మంచిదని తెలిపాడు. మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ సత్తాచాటేందుకు ప్రయత్నిస్తున్నామని గిల్ పేర్కొన్నాడు. బుధవారం మూడో టీ20 జరగనుంది.