హైదరాబాద్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రెండో వన్డేలో టీమిండియా 50 పరుగుల తేడాతో గెలిచి ఐదు వన్డేల సిరీస్లో 2-0తో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. అయితే హ్యాట్రిక్ సాధిస్తానని కలలో కూడా అనుకోలేదని మ్యాచ్ అనంతరం కుల్దీప్ చెప్పాడు.

తన హ్యాట్రిక్ క్రెడిట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీదేనని చెప్పాడు. 'హ్యాట్రిక్ సాధిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇది చాలా ప్రత్యేకమైంది. దీనివల్ల మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. చాలా గర్వించదగ్గ క్షణం ఇది. నాకు అండగా నిలిచినందుకు కోహ్లికి, ధోనీకి కృతజ్ఞతలు. ఆరంభంలో కొన్ని ప్రదేశాల్లో బంతులు వేయడానికి చాలా ఇబ్బందిపడ్డా' అని అన్నాడు.
'క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. గత మ్యాచ్లో ఓవర్లో మూడు సిక్సర్లు బాదారు. అదో అనుభవం. బౌలింగ్ ఎలా చేయాలని మహీ బాయ్ని అడిగా. అప్పుడు నీవు ఎలా వేయాలనుకుంటున్నావో అలాగే వేయి అని సలహా ఇచ్చాడు. ఇది అద్భుతంగా పని చేసింది' అని కుల్దీప్ చెప్పాడు.
గురువారం ఆస్ట్రేలియాతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 33వ ఓవర్లో కుల్దీప్ ఓ అద్భుతాన్ని చేసిన సంగతి తెలిసిందే. 32.2వ బంతికి మాథ్యూ వేడ్, 32.3వ బంతికి అగర్, 32.4వ బంతికి కమిన్స్ను వరుస బంతుల్లో పెవిలియన్కు కుల్దీప్ హ్యాట్రిక్ రికార్డు అందుకున్నాడు.
అంతకముందు 1987లో చేతన్ శర్మ న్యూజిలాండ్పై ఈ ఘనత సాధించి తొలి హ్యాట్రిక్తో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 1991లో ఇదే ఈడెన్లో శ్రీలంకపై కపిల్ దేవ్ హ్యాట్రిక్ సాధించాడు. 26 ఏళ్ల తర్వాత మళ్లీ కుల్దీప్ యాదవ్ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం.