
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ను కుదిపేస్తోన్న ప్రధాన అంశం. కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ టాంపరింగ్కు పాల్పడటం... ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది.
విచారణ కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లు దోషులని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. అంతేకాదు బాల్ టాంపరింగ్కు పాల్పడి దేశం పరువు తీసినందుకు గాను జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. ఇక, మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన కామరూన్ బాన్క్రాఫ్ట్పై 9 నెలల నిషేధం విధించింది.

బాల్ టాంపరింగ్ వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తేలిగ్గా తీసుకున్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది. ఆసీస్ క్రికెటర్ల బాల్ టాంపరింగ్పై మాజీలు సైతం తీవ్ర విమర్శలు చేశారు. ఆస్ట్రేలియా క్రికెట్ సంస్కృతిని చెడగొట్టారంటూ మండిపడ్డారు.
అభిమానులు అయితే మరో అడుగు ముందుకేసి బాల్ టాంపరింగ్పై పేరడీ వీడియోలు రూపొందిస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్కు చెందిన ఓ వ్యక్తి మరో అడుగు ముందుకేసి బాల్ టాంపరింగ్ వివాదానికి కారణమైన పసుపు రంగు టేపు వేలానికి ఉంచినట్లు పేర్కొన్నాడు.
ఆన్లైన్ వెబ్సైట్ 'ట్రేడ్ మీ'లో ఒక టేపు ఫొటో ఉంచి దానికి 'ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ టేప్' అని పేరు పెట్టాడు. దీనిని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరైతే వేలంలో కూడా పాల్గొన్నారు. ఇప్పటివరకు దీని కోసం 45 మంది తమ బిడ్లు దాఖలు చేశారు.
టేప్ను వేలానికి ఉంచిన వ్యక్తి ఆ వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ ఈ విధంగా వివరించాడు. 'ఈ ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ టేపు ద్వారా గేమ్లో మోసానికి పాల్పడొచ్చు. టెస్టు మ్యాచ్ల్లో బంతి స్వింగ్ అయ్యేందుకు వాడొచ్చు. త్వరపడండి. స్మిత్ కంటే ముందుగా దీన్ని మీరు సొంతం చేసుకోండి' అని పేర్కొన్నాడు.
'కేప్టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బాన్క్రాఫ్ట్ వాడింది ఈ టేపే అని నేను కచ్చితంగా చెప్పలేను. కానీ, దీంతో బాన్క్రాఫ్ట్ చేసినట్లు చేయవచ్చని హామీ మాత్రం ఇవ్వగలను' అని టేప్ గురించి భలే చక్కగా వెల్లడించాడు. ఈ టేప్ని ఎవరైనా దక్కించుకోవాలంటే వేలంలో పాల్గొనాలని సూచించాడు. ఏప్రిల్ 1 వరకే ఈ వేలం ఉంటుందని స్పష్టం చేశాడు.