హైదరాబాద్: ముఖానికి నల్ల రంగు పూసుకుని ఉంటే నైట్హుడ్ బిరుదు పొందేవాడనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్, బీబీసీ పండిట్ జెఫ్రీ బాయ్కాట్ క్షమాపణలు చెప్పాడు. బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ వేదికగా ఇటీవలే ఇంగ్లండ్-వెస్టిండిస్ జట్ల మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
మూడు రోజుల్లోనే ముగిసిన ఈ డే-నైట్ టెస్టులో వెస్టిండిస్పై ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 514 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండిస్ తొలి ఇన్నింగ్స్లో 168 పరుగులకే ఆలౌటైంది.

ఫాలో ఆన్ ఆడిన విండీస్ తన రెండో ఇన్నింగ్స్లో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్ వైట్(40)మినహా ఎవరూ రాణించలేదు. మూడో రోజు ఇంగ్లండ్ బౌలర్లు 19 వికెట్లు తీయడం విశేషం. ఈ డే-నైట్ టెస్టు మ్యాచ్ సందర్భంగా ప్రశ్న మరియు జవాబు సెషన్లో చాలా మంది వెస్టిండీస్ క్రికెటర్లకు నైట్హుడ్ బిరుదు ఇవ్వడంపై 76 ఏళ్ల జెఫ్రీ బాయ్కాట్ మాట్లాడాడు.
'ముఖానికి నల్ల రంగు వేసుకుని ఉంటే నాకూ ఆ అవార్డు దక్కేది' అని చెప్పాడు. దీంతో ఇవి జాతివివక్ష వ్యాఖ్యలేనన్న విమర్శల నేపథ్యంలో బాయ్కాట్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. 'ఎవరినీ గాయపరచాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ నేను మాట్లాడింది పూర్తిగా తప్పు. నేను క్షమాపణలు చెబుతున్నా. వెస్టిండీస్ క్రికెట్ అంటే నాకెంతో ఇష్టం. ఆ జట్టు ఆటగాళ్లంటే ఎంతో గౌరవం' అని బాయ్కాట్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే సర్ వివ్ రిచర్డ్స్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, సర్ కోట్నీ వాల్స్లతో పాటు వెస్టిండిస్ తరుపున ఇప్పటివరకు 11 మంది క్రికెటర్లు నైట్హుడ్ బిరుదు అందుకున్నారు. జెఫ్రీ బాయ్కాట్ ఇంగ్లండ్ ఆల్ టైమ్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా ఉన్నారు. ఇంగ్లండ్ తరుపున 108 టెస్టులాడి 47.72 యావరేజితో 8114 పరుగులు చేశాడు.
ఇందులో 22 సెంచరీలతో పాటు 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం జెఫ్రీ బాయ్కాట్ ప్రస్తుతం క్రికెట్ పండిట్గా కొనసాగుతున్నారు. టెస్టు మ్యాచ్ స్పెషల్ పేరుతో బీసీసీలో వచ్చే క్రికెట్ ప్రోగ్రామ్కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.