కొన్ని రోజుల క్రితం ముగిసిన వన్డే వరల్డ్ కప్లో టీమిండియా వెటరన్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ అద్భుతంగా ఆడారు. కోహ్లీ అయితే ఈ టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు కూడా. అద్భుతంగా ఆడిన అతను 765 పరుగులతో రాణించాడు. అదే సమయంలో జట్టుకు అదిరే ఆరంభాలు అందించిన రోహిత్ శర్మ కూడా 597 పరుగులు చేశాడు.
అయితే వీళ్లిద్దరూ వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడతారా? లేదా? అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనిపై వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ స్పందించాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓటమి తర్వాత వీళ్లిద్దరూ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్నారు. కోహ్లీ వయసు 35 ఏళ్లుకాగా, రోహిత్ వయసు 36 ఏళ్లు. దీంతో వీళ్లిద్దరి టీ20 భవితవ్యంపై సందేహాలు ఏర్పడ్డాయి.

దీని గురించి మాట్లాడిన గేల్.. 'ఈ విషయంలో వాళ్లిద్దరే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆడాలని వాళ్లు అనుకుంటే ఆడించడంలో తప్పేం ఉంది. వాళ్లు దేశం కోసం ఎంతో చేశారు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం వాళ్లకు ఇవ్వాలి' అని చెప్పాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా తన రికార్డు బద్దలు కొట్టిన రోహిత్కు కూడా కంగ్రాట్స్ చెప్పాడు.
'నాకు రోహిత్ ఎగ్రెసివ్ బ్యాటింగ్ చాలా ఇష్టం. నన్నడిగితే బ్యాటర్లు అందరూ బౌలర్లను డిస్ట్రాయ్ చేయాలి. రోహిత్ అదే పని చేస్తున్నాడు' అని మెచ్చుకున్నాడు. గేల్ తన కెరీర్లో 483 మ్యాచుల్లో 553 సిక్సర్లు బాదాడు. రోహిత్ తాజాగా ఈ రికార్డును అధిగమించాడు. అతను 462 ఇన్నింగ్సుల్లో 582 సిక్సర్లు బాదాడు. అలాగే వన్డేల్లో 50 సెంచరీలు సాధించిన కోహ్లీకి కూడా కంగ్రాట్స్ చెప్పాడు.
'వన్డేల్లో యాభై సెంచరీలు బాదడం అంటే మాటలు కాదు. సచిన్ టెండూల్కర్ వంటి లెజెండరీ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టడం అంటే మాటలు కాదు. ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా మరెవరూ రాలేరు' అని గేల్ చెప్పుకొచ్చాడు. వన్డే వరల్డ్ కప్లో కివీస్తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ బాదిన కోహ్లీ.. వన్డేల్లో 50వ శతకం నమోదు చేశాడు.