
హైదరాబాద్: విధ్వంసకర క్రికెటర్లలో క్రిస్ గేల్ ఒకడనేది పాత మాట. ప్రస్తుతం అతణ్ని జట్టులోకి తీసుకుందామా అనే సందేహంలో సెలక్టర్లు పడిపోతున్నారు. ఇదే క్రమంలో వెస్టిండీస్ జాతీయ జట్టు టీ20 సిరీస్లో ఆడేందుకు పక్కన పెట్టేసింది. ఇది గేల్కు మొదటిసారేం కాదు. పలు దేశీవాలీ లీగ్లలో ఆడే గేల్ను ఐపీఎల్ 2018వేలంలో చివరి రౌండ్ వరకూ కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.
చివర్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేయడంతో.. మూణ్ణాలుగు మ్యాచ్లలో బ్యాటింగ్తో మెప్పించాడు. అయితే తాజాగా విండీస్ టీ20 జట్టులో గేల్ స్థానం కోల్పోయాడు. బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఎంపిక చేసిన జట్టులో గేల్కు ఉద్వాసన పలికారు. ఈ మేరకు 13 మందితో కూడిన జట్టును విండీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.
ఇందులో గేల్ను తప్పించిన బోర్డు.. అతని స్థానంలో ఎడమ చేతి పేసర్ షెల్డాన్ కోట్రెల్కు చోటు కల్పించింది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో గేల్ ఆడిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో 40 పరుగులు చేసిన గేల్.. రెండో వన్డేలో 29 పరుగులు చేయగా, మూడో వన్డేలో 73 పరుగులతో ఆకట్టుకున్నాడు.
'బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు గేల్కు విశ్రాంతినిచ్చాం. అతని స్థానంలో వైవిధ్య బౌలర్ షెల్డాన్ కొట్రెల్కు అవకాశం ఇచ్చాం. ఇటీవల యూకేలో జరిగిన చారిటీ మ్యాచ్లో పాల్గొన్న విండీస్ జూనియర్ టీమ్లోని అత్యధిక శాతం సభ్యులే బంగ్లాదేశ్తో సిరీస్లో కనిపిస్తారు' అని విండీస్ బోర్డు సెలక్టర్ల చైర్మన్ కర్టనీ బ్రౌన్ తెలిపారు.