
హైదరాబాద్: ప్రపంచంలో అత్యుత్తమ విధ్వంసకర బ్యాట్స్మెన్లుగా పేరుగాంచిన క్రిస్ గేల్, బ్రెండన్ మెక్కల్లమ్లు ఒకే జట్టుకు ఆడనున్నారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఈ అరుదైన దృశ్యాన్ని అభిమానులు కనువిందు చేయనున్నారు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో భాగంగా వెస్టిండిస్కు చెందిన క్రిస్ గేల్, న్యూజిలాండ్కు చెందిన బ్రెండన్ మెక్కల్లమ్ రంగపుర్ రైడర్స్ తరఫున ఆడనున్నారు. వీరిద్దరూ త్వరలోనే జట్టులో చేరనున్నారు. వీరిద్దరి చేరికతో జట్టు బలోపేతం కావడంతో పాటు ప్రత్యర్థులపై పైచేయి సాధించవచ్చని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
నవంబర్ 15న మెక్కల్లమ్ జట్టులో చేరతాడని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 18న జరిగే మ్యాచ్లో వీరిద్దరూ కలిసి ఆడతారని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. 'టీ20ల్లో ప్రారంభమే అత్యంత కీలకం. ఇందులో మేం వెనకే ఉన్నాం. బ్యాట్స్మెన్ మద్దతు లభిస్తే తర్వాత బౌలర్లకు పని సులభమవుతుంది' అని రంగపుర్ జట్టు కోచ్ టామ్మూడీ అన్నారు.
'రెండు మూడు రోజుల్లో గేల్, మెక్కల్లమ్, కుశాల్ పెరీరా జట్టులో చేరతారు. మా టాప్ ఆర్డర్ పరుగులు చేయడంలో విఫలమవుతోంది. వారి రాకతో మళ్లీ పుంజుకుంటుంది' అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టోర్నీలో భాగంగా ఇప్పటికే రంగపుర్ రైడర్స్ మూడు మ్యాచ్లాడగా ఒక దానిలో విజయం సాధించి, రెండింటిలో ఓటమి పాలైంది.