హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో తన చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి దారి పట్టిన బెంగళూరు ఆటతీరుపై అభిమానులకు ఆ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ క్షమాపణలు తెలియజేశాడు. ఈ సీజన్ లో తమ జట్టు వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నా అభిమానులు మద్దతు తెలుపుతూనే ఉండటంపై అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
'నా ప్రదర్శనతో పాటు జట్ట ప్రదర్శనపై సంతోషంగా లేను. చాలా నిరాశ కలిగించింది. ఈ సీజన్లో మా ఆట తీరు బాలేదు. అందుకు ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. మేము వరుసగా ఓడిపోతున్నా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అభిమానుల అభిమానం వెలకట్టలేనిది' అని గేల్ అన్నాడు.

'అసలు ఇంతటి పేలవమైన ఆటను ప్రదర్శించినా ఇంకా ఎలా సపోర్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే' అని గేల్ పేర్కొన్నాడు. జమైకాకు చెందిన క్రిస్ గేల్ ఐపీఎల్ పదో సీజన్లో పెద్దగా రాణించలేదు. ఎనిమిది మ్యాచ్లాడిన గేల్ కేవలం 152 పరుగులు మాత్రమే చేశాడు.
ఐపీఎల్ చరిత్రలోనే క్రిస్ గేల్కు ఇది రెండో అతి తక్కువ స్కోరు కావడం విశేషం. కాగా, ఈ సీజన్లో ఇప్పటివరకూ 13 మ్యాచ్లు ఆడిన బెంగళూరు 10 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కేవలం రెండు మ్యాచ్ల్లోనే విజయం సాధించగా, ఒక మ్యాచ్ రద్దయింది.