శ్రీలంక పర్యటనలో టీ20 వరల్డ్ కప్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరో సిరీస్కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తొలి వన్డే ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ వన్డే సిరీస్ను సద్వినియోగం చేసుకోవాలని, జట్టు కూర్పుపై ఓ అంచనాకు రావాలని టీమిండియా భావిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం విశ్రాంతి తీసుకున్న స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆ మెగాటోర్నీలో విజయానంతరం ఈ ఇద్దరూ టీ20 ఫార్మాట్కు గుడ్బై పలికిన విషయం తెలిసిందే. వన్డే, టెస్టు ఫార్మాట్లో కొనసాగుతామని తెలిపారు. అయితే గౌతమ్ గంభీర్ కోచింగ్లో తొలిసారి నెట్స్లో బ్యాట్లు పట్టిన ఈ స్టార్లు ఇద్దరూ సిక్సర్ల మోత మోగించారు.

ప్రాక్టీస్లో కోహ్లి, రోహిత్ భారీ షాట్లు విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేయగా ఇది వైరల్గా మారింది. ఈ వీడియోలో కోహ్లి బ్యాటింగ్ను గంభీర్ తీక్షణంగా చూశాడు. కోహ్లి భారీ షాట్లను చూసి గంభీర్ ఆశ్చర్యపోయాడు. ప్రాక్టీస్ మధ్యలో కోహ్లి-గంభీర్ సరదాగా ముచ్చటించుకున్నారు. భారత్ తరఫున కొన్నేళ్లపాటు కలిసి పరుగులు చేసిన వీరిద్దరు ఐపీఎల్లో పలు సందర్భాల్లో తీవ్రంగా గొడవ పడిన విషయం తెలిసిందే.
ఐపీఎల్-2023లో ఆర్సీబీ-లక్నో మ్యాచ్ అనంతరం ఒకరినొకరిపై దూసుకెళ్లారు. దీంతో టీమిండియా కోచ్గా గంభీర్ ఎంపికైన అనంతరం జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ అందరిలో పెరిగింది. కానీ గంభీర్-కోహ్లి కలిసిపోయారు. తిరిగి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని పట్టుదలతో సిద్ధమయ్యారు.