Gautam Gambhir: టీ20 ఇంటర్నేషనల్స్లో భారత జట్టు హవా కంటిన్యూ అవుతోంది. ఈ ఫార్మట్లో వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లల్లో ఓడింది ఒక్కదాంట్లోనే. ఏడు మ్యాచ్లల్లో తిరుగులేని విజయాలను అందుకుంది. రెండు సిరీస్లను కైవసం చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన తరువాత జింబాబ్వేలో పర్యటించింది టీమిండియా. అక్కడ విజయకేతనాన్ని ఎగురవేసింది. అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో గెలుచుకుంది. తొలి మ్యాచ్లో ఓడిన తరువాత వరుసగా నాలుగింట్లో విజయఢంకా మోగించింది. అదే దూకుడును శ్రీలంకలో కొనసాగిస్తోంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0 తేడాతో వశం చేసుకుంది.

హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ సాధించిన తొలి సిరీస్ ఇది. రెగ్యులర్ హెడ్ కోచ్గా అపాయింట్ అయిన తరువాత ఎదుర్కొన్న తొలి సిరీస్లోనే విజయాన్ని అందుకున్నాడీ మాజీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు జట్టులో లేకపోయినప్పటికీ.. ఐపీఎల్ స్టార్లతోనే జట్టుకు విజయాన్ని అందించాడు.
అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉండటం వల్ల గంభీర్ను హెడ్ కోచ్గా సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఈ పదవిలో ఆయన ఎంతో కాలం కొనసాగలేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలోనే ఆయన తప్పుకొంటారని, కొత్త హెడ్ కోచ్ రావొచ్చనే వాదనలు వినిపిస్తోన్నాయి.
టీమిండియా మాజీ ప్లేయర్ జోగిందర్ శర్మ.. ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. జట్టులో ఇప్పుడున్న వారితో అతను అంత సులువుగా కలిసిపోలేడని అంచనా వేశాడు. ప్రస్తుతం జట్టు పరిస్థితులు అనుకూలంగా ఉండటం, శ్రీలంకతో సిరీస్ కావడం ఇప్పటికిప్పుడు విజయాలు అందినప్పటికీ.. మున్ముందు ఇబ్బందికర పరిణామాలు తలెత్తవచ్చని అంచనా వేశాడు.

గంభీర్ కాంట్రాక్ట్ గడువు 2027 వరకు ఉన్నప్పటికీ.. అప్పటివరకు జట్టులో కొనసాగలేడని జోగిందర్ శర్మ చెప్పాడు. సీనియర్లకు మింగుడుపడని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని, అది వివాదానికి దారి తీయొచ్చని అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్గా జట్టును సమర్థవంతగా నడిపించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఎక్కువ కాలం కొనసాగలేడని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
గౌతమ్ గంభీర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్లేయర్లతో విభేదాలు తలెత్తవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంపై గంభీర్తోనే తాను నేరుగా మాట్లాడాననీ చెప్పుకొచ్చాడు. ఒకరిని పొగిడే వ్యక్తిత్వం అతనిది కాదని, జట్టు ప్లేయర్లతో ఇమడలేడని వ్యాఖ్యానించాడు.