హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో మళ్లీ కీలకం కానున్నాడు. గతేడాది గంభీర్ను డీడీసీఏలో ప్రభుత్వ నామినీగా నియమించిన సంగతి తెలిసిందే.
అయితే, డీడీసీఏ ఎన్నికలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు డీడీసీఏ పాలన పగ్గాలు చేపట్టిన జస్టిస్ విక్రమ్జీత్ సేన్ క్రికెట్ ఆడుతూ పాలనాపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం గంభీర్కు లేదని స్పష్టం చేశాడు.
తాజాగా శుక్రవారం డీడీసీఏకి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రజత్ శర్మ నేతృత్వంలోని ప్యానెల్ ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా కార్యదర్శిగా ఎన్నికైన తిహారా మాట్లాడుతూ గంభీర్ ఇకపై డీడీసీఏలో ప్రభుత్వ నామినీగా కీలకంగా ఉంటాడని అన్నారు.
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో క్రికెట్కు సంబంధించి కీలక నిర్ణయాలన్నింట్లోనూ గంభీర్ పాత్ర కూడా ఉంటుందని తెలిపాడు. ''ఎన్నికల్లో గెలిచిన సభ్యులు పాలన సంబంధిత వ్యవహారాలు చూసుకుంటారు. క్రికెట్ సంబంధిత నిర్ణయాలన్నీ గంభీరే తీసుకుంటాడు. ఢిల్లీ క్రికెట్లో గంభీర్ది పెద్ద పేరు" అని అన్నాడు.
"అన్నింటినీ రికార్డుల్లో చేర్చలేం. క్రికెట్కు సంబంధించిన విధాన నిర్ణయాలన్నీ గంభీరే తీసుకుంటాడు'' అని తిహారా చెప్పాడు. అంతేకాదు గంభీర్ నేతృత్వంలో క్రికెట్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఢిల్లీ ఎన్నికల్లో మదన్ లాల్ ప్యానల్పై రజత్ శర్మ నేతృత్వంలోని ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.