

హైదరాబాద్: ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెల్లటి గడ్డంతో కనిపించడంతో 5 నుంచి 10 సంవత్సరాల పెద్దోడిలా కనిపిస్తున్నాడని గంభీర్ అన్నాడు.
ధోని వీలైనంత త్వరగా తన గడ్డం రంగు మార్చుకోవాలని గంభీర్ సలహా ఇచ్చాడు. గంభీర్ తాజాగా ఓ క్రీడా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "ధోని తన కొత్త లుక్ కారణంగా చాలా పెద్ద వాడిలా కనబడుతున్నాడు. ఎవరో ఒకరు ఈ విషయాన్ని ధోనికి చెప్పాలి" అని అన్నాడు.
"ఇంగ్లాండ్ పర్యటనలో ధోని తెల్లటి గెడ్డంతో ఆడుతున్నాడు. దీని వల్ల అతడు తన ప్రస్తుత వయసు కంటే ఐదు పదేళ్లు పెద్దోడిలా కనిపిస్తున్నాడు. పలువురు యువ ఆటగాళ్లతో పోలిస్తే ధోనీ చాలా ఫిట్గా ఉన్నాడు. మైదానంలో చురుగ్గానే కదులుతాడు" అని గంభీర్ పేర్కొన్నాడు.
"కొత్త లుక్ కారణంగానే అతడు అలా కనిపిస్తున్నాడు. ధోనీ అలా కనపడకుండా ఉండాలంటే వెంటనే అతడు తన గెడ్డం రంగు మార్చుకోవాలి" అని గంభీర్ చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే గంతలో వీరిద్దరూ జట్టులో ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి పడని సంగత తెలిసిందే.
ఇదిలా ఉంటే మూడు వన్డేల సిరిస్లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోని ఆటతీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచి సిరిస్ను 1-1తో సమం చేసింది. దీంతో ఇరు జట్ల నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం లీడ్స్ వేదికగా జరగనుంది.