
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 0-2తో చేజార్చుకున్న కోహ్లీసేనకు మద్దతుగా నిలవాలని టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ క్రికెట్ అభిమానులకు సూచించాడు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సిరిస్లో ఇప్పటికే ముగిసిన కేప్ టౌన్, సెంచూరియన్ టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలు కావడంతో సిరిస్ను 0-2తో చేజార్చుకుంది. దీంతో అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు క్రికెట్ అభిమానులు సైతం కోహ్లీసేనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇండియానే పులులు.. విదేశాల్లో పిల్లులంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు.
దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలు ఎందుకు.. ఆ శ్రీలంక, వెస్టిండీస్లతోనే సిరీస్లు ఆడండి అంటూ హేళన చేస్తున్నారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లారని, సఫారీ పిచ్లపై శ్రీలంకతో మ్యాచ్లు నిర్వహించినా మనవాళ్లు ఓడిపోవడం ఖాయమని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ స్పందించాడు. 'భారత జట్టుకు మద్దతుగా నిలవాల్సిన సమయమిది. విమర్శలు చేయడం తగదు. ఇదే జట్టు గతంలో ఎన్నో మరపురాని విజయాలు అందించింది. రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించలేనంత మాత్రాన విమర్శలు చేయడం సరికాదు. మన వాళ్లను విమర్శించడం ఆపి.. బాగా ఆడిన ప్రత్యర్థి జట్టును పొగడండి. అందులో తప్పేమీ లేదు' అని గంభీర్ తన ట్విటర్లో పేర్కొన్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం జట్టు ఓటమిపై స్పందించాడు. 'టీమిండియా విదేశాల్లో ఓడితే జట్టుపై విమర్శలు చేస్తాం. ఇది జట్టు సమస్య ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఇది భారత క్రికెట్ సమస్య. ఆ సమస్యను పరిష్కరించడంలో మనం విఫలం అవుతున్నాం' అని సంజయ్ మంజ్రేకర్ తన ట్విటర్లో పేర్కొన్నాడు.
కాగా, మూడు టెస్టుల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజార్చుకుంది. ఈ సిరిస్లో చివరిదైన మూడో టెస్టు జొహన్నెస్బర్గ్ వేదికగా జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. కనీసం ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. ఇక, సఫారీ జట్టు మాత్రం సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.