
హైదరాబాద్: దుబాయ్ వేదికగా గురువారం పాకిస్తాన్తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫఖర్ జమన్ (32 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్కస్ స్టొయినిస్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (17 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. పాకిస్థాన్ ఆల్రౌండర్ మొహ్మద్ హఫీజ్ బౌలింగ్లో వార్నర్ ఓ గమ్మత్తైన షాట్ కొట్టాడు. ఇన్నింగ్స్లో 8వ ఓవర్ వేసిన హఫీజ్ తన తొలి బంతిని వార్నర్కు విసిరాడు. అయితే బంతి వేయడంలో నియంత్రణ కోల్పోయిన హఫీజ్.. క్రీజుకు దూరంగా విసిరాడు. ఆ బంతి కాస్త పిచ్పై రెండు సార్లు బౌన్స్ అయ్యింది. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వచ్చిన వార్నర్.. రెండు సార్లు బౌన్స్ అయిన ఆ బంతిని లెగ్ సైడ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అది సింగిల్, డబుల్ కూడా కాకుండా ఏకంగా సిక్సర్గా వెళ్లింది. ఆ షాట్ చూసిన పాక్ కెప్టెన్ బాబర్ ఖంగుతిన్నాడు. మాములుగా అయితే అంపైర్ దానిని డెడ్ బాల్గా ప్రకటించాలి. అనూహ్యంగా నో బాల్గా ఇచ్చాడు.
ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీనియర్ ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ చేసిన ఈ పనిపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా తన అసహనంను బయటపెట్టాడు. 'డేవిడ్ వార్నర్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. ఇది నిజంగా అవమానకరం. చాలా సిగ్గుగా ఉంది. ఈ విషయంపై ఏమంటావ్ రవిచంద్రన్ అశ్విన్' అని గంభీర్ ట్వీట్ చేశాడు. క్రీడా స్ఫూర్తికి సంబంధించిన విషయాలపై చర్చలకు దిగే అశ్విన్ను అభిప్రాయం అడగడంతో గంభీర్ కొత్త వివాదానికి తెరలేపాడు. ఈ ట్వీట్ కూడా నెట్టింట వైరల్ అయింది. మరి ఈ విషయంపై యాష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఇక గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్పై ఓ అభిమాని స్పందించాడు. అదీ కూడా తెలుగులో. 'నువ్ ఏందిరా రా నాయనా మధ్యలో' అంటూ ఆ అభిమాని ట్వీట్ చేశాడు. బహుశా ఆ ట్వీట్ చేసిన అతడు డేవిడ్ వార్నర్ లేదా సన్రైజర్స్ అభిమాని అయ్యుండొచ్చు. సెమీస్ మ్యాచులో వార్నర్ ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. అయితే తాను ఔటైన విధానాన్ని చూస్తే మాత్రం అతడిని దురదృష్టం వెన్నాడిందని కచ్చితంగా చెప్పొచ్చు. షాదాబ్ ఖాన్ వేసిన 11వ ఓవర్ మొదటి బంతి.. వార్నర్ బ్యాటుకు తాకలేదు. కానీ పాక్ ప్లేయర్స్ అప్పీల్ చేయగానే.. అంపైర్ ఔటిచ్చాడు. వార్నర్ కూడా తాను ఔటేమోనని భావించి పెవిలియన్ చేరాడు. రివ్యూ తీసుకుంటే అతడు బతికిపోయేవాడు.