టీమిండియా యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అరంగేట్రంలోనే అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మెయిడిన్తో అరంగేట్రం చేసిన మూడో భారత బౌలర్గా మయాంక్ రికార్డు నెలకొల్పాడు. అజిత్ అగార్కర్, అర్షదీప్ సింగ్ తర్వాత అతను ఈ ఘనత సాధించాడు. అయితే ఈ గొప్ప ప్రదర్శన చేయడంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్ర ఉందని మయాంక్ యాదవ్ తెలిపాడు.
''అరంగేట్రంలో ఉత్సాహంతో పాటు కాస్త ఆందోళనకు గురయ్యాను. ఎందుకంటే గాయం తర్వాత తిరిగి ఆడిన మొదటి మ్యాచ్ ఇదే. దాంతో కాస్త టెన్షన్ పడ్డాను. గాయం నుంచి కోలుకున్న ఆ నాలుగు నెలలు చాలా కష్టంగా గడిచింది. నా కంటే నాకోసం పనిచేసిన వ్యక్తులు మరింత శ్రమించారు. అయితే నేను వేగవంతమైన బంతులు కంటే కట్టుదిట్టమైన బంతుల్ని సంధించాలని నిర్ణయించుకున్నాను. సాధ్యమైనంత తక్కువ పరుగులు ఇవ్వాలని భావించాను''

''కెప్టెన్ సూర్య వైవిధ్యాలపై కంటే నా సామర్థ్యంపైనే ఎక్కువ దృష్టిపెట్టమని సూచించాడు. గ్వాలియర్ పిచ్ బౌన్స్కు అంతగా అనుకూలించలేదు. దాంతో దానికి తగ్గట్లుగా పేస్ను మార్చుకున్నాను. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కొత్తగా ప్రయత్నించకుండా, గతంలో చేసినట్లుగానే ఆడమని సూచనలు ఇచ్చాడు. భిన్నంగా ప్రయత్నించాలని ఆలోచించవద్దని అన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ అనే ఆలోచన కూడా రానివొద్దని, ప్రాసెస్పై ఫోకస్ చేసి ఆడమని గంభీర్ సూచించాడు'' అని మయాంక్ యాదవ్ పేర్కొన్నాడు.
ఇక భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టీ20 విషయానికొస్తే.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్దీ హసన్ మీరాజ్(35 నాటౌట్; 32 బంతుల్లో, 3 ఫోర్లు), నజ్ముల్ హెస్సేన్ షాంటో(27; 25 బంతుల్లో, ఫోర్, సిక్సర్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్దీప్ సింగ్(3/14) చెరో మూడు వికెట్లు, మయాంక్ (1/21), హార్దిక్ (1/26), సుందర్(1/12) తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి గెలుపొందింది. హార్దిక్ పాండ్య (39 నాటౌట్; 16 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (29; 14 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శాంసన్(29; 19 బంతుల్లో, 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. మెహ్దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్లు తలో వికెట్ తీశారు.