సొంతగడ్డపై భారత్కు ఊహించని పరాజయం. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. పుణె టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓటమిపాలై మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది.
2012 తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోచ్గా బాధ్యతలు అందుకున్న గంభీర్ వ్యూహాలపై పెద్దఎత్తు విమర్శలు వస్తున్నాయి. అయితే విమర్శలను పక్కనపెడితే గంభీర్ కోచ్గా చేసిన తప్పిదాలతో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. కోచ్గా త హయాంలో టీమిండియా కోరుకోని రికార్డులు నమోదుచేసుకుంది.

శ్రీలంక పర్యటనతో టీమిండియా కోచ్గా గంభీర్ బాధ్యతలు అందుకున్నాడు. అయితే టీ20 సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్ను 0-2తో కోల్పోయింది. 27 ఏళ్ల తర్వాత లంక సిరీస్ను టీమిండియా కోల్పోవడం ఇదే ప్రథమం. శ్రీలంక స్పిన్నర్లు ఎదుర్కోవడంలో గంభీర్ ప్రత్యేక వ్యూహాలు చేయకపోవడం ఓటమికి కారణం అయ్యింది. అంతేగాక లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత్ అన్ని మ్యాచ్ల్లో ఆలౌటైంది. భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే చరిత్రలో ఇలా జరడం ఇదే తొలిసారి.
అంతేగాక ఓ క్యాలెండర్ ఇయర్లో భారత్ వన్డే విజయం లేకుండా ముగించడం కూడా ఇదే మొదటిసారి. అయితే ఈ కోరుకోని రికార్డుకు అవిరామ టీ20లు, టెస్టుల షెడ్యూల్ కూడా ఓ కారణం. ఇక న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్కు ముందు గంభీర్ చెప్పిన మాటలకు చేతలకు ఏం సంబంధం లేదు. 'ఒక్క రోజులో 400 పరుగులు చేయగలం, అవసరమైతే రెండు రోజులు వరుసగా బ్యాటింగ్ చేయగలం' అని గంభీర్ అన్నాడు.
కానీ బెంగళూరు టెస్టులో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై భారత్కు ఇదే అత్యల్ప స్కోరు. ఇక ఈ మ్యాచ్లో ఓటమితో 19 ఏళ్ల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో, స్వదేశంలో 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత పుణె టెస్టులోనూ ఓడి సొంతగడ్డపై తొలిసారి కివీస్కు టెస్టు సిరీస్ అప్పగించింది. ఈ పేలవ రికార్డులకు ఆటగాళ్లతో పాటు కోచ్గా గంభీర్ బాధ్యత వహించాల్సి ఉంది. ప్రత్యర్థిని కళ్లెం వేయడానికి గంభీర్ పదునైన వ్యూహాలతో రావాల్సి ఉంది.