సీనియర్ ప్లేయర్లు గౌతమ్ గంభీర్- శ్రీశాంత్ గొడవ పడిన సంగతి తెలిసిందే. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)లోని గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనని ఫిక్సర్ అంటూ గంభీర్ అసభ్యకరమైన మాటలు అన్నాడని శ్రీశాంత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే శ్రీశాంత్కు LLC లీగల్ నోటీసులు జారీచేసింది.
టోర్నమెంట్ కాంట్రాక్ట్ నిబంధనలు శ్రీశాంత్ ఉల్లఘించాడని పేర్కొంటూ LLC నిర్వాహకులు లీగల్ నోటీసులు జారీ చేశారు. అలాగే సోషల్ మీడియాలో శ్రీశాంత్ పోస్ట్ చేసిన వీడియోలు తొలగించిన తర్వాతనే అతనితో చర్చలు జరుపుతామని తెలిపారు. అయితే అంపైర్లు ఇచ్చిన నివేదికలో శ్రీశాంత్ను గంభీర్ ఫిక్సర్ అన్నాడని ఎక్కడా పేర్కొనలేదు.

సహచర ఆటగాళ్లతో కారణం లేకుండా గంభీర్ గొడవలకు దిగుతుంటాడని, స్టార్ క్రికెటర్ సెహ్వాగ్ కు కూడా మర్యాద ఇవ్వడని శ్రీశాంత్ ఓ వీడియోలో పేర్కొన్నాడు. . అయితే గంభీర్ దూషించినన మాటలు చెప్పనని తొలుత ప్రకటించిన అతడు.. తర్వాత మరో వీడియోలో ఆ మాటలు వెల్లడించాడు. ఫిక్సర్ అంటూ అసభ్యకరమైన పదాలు అన్నాడని శ్రీశాంత్ వివరించాడు.
మరోవైపు ఈ వివాదంపై గౌతమ్ గంభీర్ ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. కానీ ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యాడు.''ప్రపంచం మొత్తం మీ మీద దృష్టి పెట్టిన సందర్భంలో ఒక స్మైల్ ఇవ్వండి'' అంటూ తాను నవ్వుతున్న ఫొటోని పోస్ట్ చేసి దానికి క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ కు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మద్దతు పలికాడు.
అయితే ఈ వివాదంపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి కూడా స్పందించారు. టీమిండియా కోసం శ్రీశాంత్- గంభీర్ ఇద్దరూ కలిసి ఆడారని, కానీ తన భర్తను గంభీర్ అలాంటి మాటలు అనడం షాకింగ్ గా అనిపించదని అన్నారు. ఇలా ప్రవర్తించడం సరికాదని, స్థాయిని దిగజార్చుకుని గంభీర్ ఇలా ప్రవర్తించడం దారుణమని పేర్కొన్నారు.
కాగా, మ్యాచ్ లో శ్రీశాంత్ వేసిన తొలి బంతిని గంభీర్ సిక్సర్ బాదాడు. తర్వాత బాల్ ను బౌండరీకి తరలించాడు. ఆ టైమ్ లో వీరిద్దరు ఒకరినొకరు సీరియస్ గా చూసుకున్నారు. తర్వాత కొద్దిసేపటికీ వాగ్వాదం జరిగింది.