ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్కు చేరుకుంది టీమిండియా. తొలి సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఈ గెలుపుతో తమపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. సమాజంలో ఎదిగేందుకు, కొందరు విమర్శించడమే పనిగా పెట్టుకుంటారని అన్నాడు.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమనేదే లేకుండా వరుస విజయాలతో తుది పోరుకు అర్హత సాధించింది టీమిండియా. అయితే ఒకే పిచ్ (దుబాయ్)పై ఆడుతుండటం వల్ల భారత జట్టుకు అవకాశాలు అనుకూలంగా మారాయని మాజీలు విమర్శలు చేస్తున్నారు. దీనిపైనే తీవ్రంగా స్పందించాడు గంభీర్.

"దుబాయ్ పిచ్ వల్ల మాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఏముంది. మేము ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేశాం. అక్కడికి, దుబాయ్ స్టేడియానికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. చాలా వ్యత్యాసం ఉంటుంది. కొంతమంది విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళ్తుంటారు. ఎందుకంటే వారు ఎదగాలి కదా . అయినా ఈ టోర్నమెంట్ లో ఉన్న ఇతర జట్లకు దుబాయ్ వేదిక ఎలా అయితే కొత్తదో, మాకు కూడా అంతే. ఇది మాకు తటస్థ వేదిక మాత్రమే. చివరిసారిగా ఈ స్టేడియంపై మేం ఎప్పుడు ఆడామో కూడా తెలీదు. తుది జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండాలనేదే మా ప్లాన్. ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఉపఖండం పిచ్ లపై జరుగుతోంది." అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
A clinical performance by India as they become the first team to reach3️⃣consecutive #ChampionsTrophy finals 🤩#INDvAUS pic.twitter.com/m18KpULOkQ
— ICC (@ICC) March 4, 2025
140కోట్ల మంది భారతీయులకు..
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్లు ఓడిపోయిన తర్వాత జట్టు ఎంపికపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. స్పిన్, పేస్ ను భారత జట్టు ఎదుర్కోలేకపోతుందని విమర్శలు వినిపించాయి. దీనిపై గంభీర్ స్పందిస్తూ.. "నేను వాటిని పట్టించుకోను. నా పని 140 కోట్ల మంది భారతీయులతో పాటు డ్రెస్సింగ్ రూమ్ లోని వాళ్లకు నిజాయతీగా ఉండటమే.
ఎవరు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా అస్సలు పట్టించుకోను. స్పిన్ కాంబినేషన్స్ విషయానికొస్తే.. ఐదుగురు స్పిన్నర్లలో ముగ్గురు ఆల్ రౌండర్లు ఉంటారు. ప్రజలు వాళ్లను మర్చిపోతున్నారు. ఆ ముగ్గురు కూడా నాణ్యమైన ఆల్ రౌండర్లు. మేం మొత్తం స్క్వాడ్ లో కేవలం ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లును మాత్రమే తీసుకున్నాం. 15 మంది స్క్వాడ్ లో వారు సరిపోతారనిపించింది." అని చెప్పుకొచ్చాడు.