

హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ తాజాగా ఒక ఫన్నీ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తన పెద్ద కూతురు ఆజీన్ యో-యో టెస్టును విజయవంతంగా పూర్తి చేసిందని, దానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. యో-యో పరీక్ష సందర్భంగా నిర్వహించే జిగ్జాగ్ బ్యాలెన్సింగ్ రన్నింగ్, జంప్ చేసుకుంటూ వెళ్లడం, అడ్డంకులను దాటుకుంటూ అజీన్ గమ్యాన్ని చేరుకుంది. ఫన్నీ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
తన పెద్ద కూతురు ఆజీన్ చేస్తున్న ప్రాక్టీస్ చూస్తే తాను యో-యో టెస్ట్కు ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోందన్నట్లుగా గంభీర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. క్రికెటర్లు ఫిట్నెస్ ప్రాక్టీస్లో భాగంగా చేసే కసరత్తులను ఆజీన్ చేయడం వీడియోలో చూడవచ్చు. భవిష్యత్ అథ్లెట్ అని కొందరు కామెంట్ చేయగా, తండ్రికి తగ్గ తనయ అని ఆజీన్ కచ్చితంగా నిరూపించుకోనుందని మరికొందరు నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
ఇటీవల కొంతమంది భారత క్రికెటర్లు యో-యో టెస్టు పరీక్షలో నిర్దేశించిన ప్రమాణాలను అందుకోలేక విఫలమైన విషయం తెలిసిందే. టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్ట్ (ఫిట్నెస్ టెస్ట్)లో పాసవ్వడం తప్పనిసరి. సిరీస్లకు జట్టును ఎంపిక చేసే క్రమంలో ప్రతి ఒక్క ఆటగాడు తప్పనిసరిగా యో-యో పాస్ కావాల్సిందేనని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ విశేషంగా రాణించిన అంబటి రాయుడిని ముందుగా ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపిక చేశారు.
ఆ తరువాత టెస్టులో ఫెయిల్కావడంతో జట్టును తప్పించారు. కేవలం యో-యో టెస్టునే పరిగణనలోకి తీసుకుని ఆటగాళ్లను పక్కన పెట్టేయడం సరికాదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. దీనిపై పెద్దఎత్తున్న విమర్శలు చెలరేగాయి.