యువకులకు ఆదర్శంగా నిలవలేవు
మూడో రోజు ఆటలో భారత్కు వ్యతిరేకంగా వచ్చిన డీఆర్ఎస్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరును పరిణతి లేని చర్యగా గంభీర్ పరిగణించాడు. ఇలాంటి వ్యవహారంతో యువ ఆటగాళ్లకు ఎప్పటీకీ ఆదర్శంగా నిలవలేడని మండిపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ ఆయన హితవు పలికాడు. ఇది చాలా దురదృష్టకర సంఘటనగా వ్యాఖ్యానించాడు. స్టంప్స్ మైక్ వద్దకు వెళ్లి మరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని కోహ్లీకి గౌతీ సూచించాడు.
ఎల్గర్ను చూసి నేర్చుకో
ఇదే టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాకు కూడా ఇలాగే వ్యతిరేక నిర్ణయం వచ్చిందని, కానీ ఆ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఇలా వ్యవహరించలేదని గుర్తు చేశాడు. టెక్నాలజీ అనేది మీ చేతుల్లో ఉండదని, అలాంటప్పుడు నీవు కూడా ఎల్గర్ లాగే వ్యవహరించాల్సిందని గంభీర్ హితవు పలికాడు. విరాట్ కోహ్లీ తీరు పట్ల హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అతనితో మాట్లాడుతాడని ఆశిస్తున్నట్లు గౌతం గంభీర్ తెలిపాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూలో ఔటయ్యాడని సౌతాఫ్రికా రివ్యూకు వెళ్లింది. కానీ ఆ నిర్ణయం భారత్కు అనుకూలంగా వచ్చింది.
స్టంప్స్లో విరాట్ వ్యాఖ్యలు
అసలు ఏం జరిగిందంటే భారత్ విసిరిన 212 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తోంది. 21వ ఓవర్ను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేశాడు. బ్యాటింగ్ చేస్తున్న ఎల్గర్ను ఎల్బీడబ్ల్యూలో ఔటని భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. అయితే రివ్యూలో బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ ఎల్గర్ను నాటౌట్గా ప్రకటించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. కెప్టెన్ కోహ్లీ అయితే అసహనంతో స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి ప్రత్యర్థి జట్టు పైన మాత్రమే కాదు, మీ జట్టుపైనా కూడా దృష్టి పెట్టడంటూ వ్యాఖ్యానించాడు. దీనికి తోడు 11 మందికి వ్యతిరేకంగా ఒక దేశం ఉందంటూ వైస్ కెప్టెన్ లోకేష్ రాహుల్ వ్యాఖ్యానించడం కూడా స్టంప్స్ మైక్లో వినిపించింది. దీంతో విరాట్ కోహ్లీ ప్రవర్తనపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.