రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ జట్టు భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాడు. కోచ్గా తన తొలి మిషన్లో టీ20ల్లో గంభీర్ సక్సెఫుల్ అయ్యాడు. కానీ వన్డేల్లో తన వ్యూహాలతో జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్ను కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఇక టెస్టు ఫార్మాట్లో గంభీర్ గ్రీన్ టిక్ సాధించాడు. బంగ్లాదేశ్పై తొలి టెస్టు విజయంతో సుదీర్ఘ ఫార్మాట్లో కోచ్గా బోణీ కొట్టాడు. చెన్నై వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ వంటి ఆల్రౌండర్లు భారత టెస్టు జట్టులో ఉన్నారని, కానీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టుకు కావాలని అన్నాడు.

ఆల్రౌండర్ కోసం దేశవాళీ క్రికెట్లో అన్వేషించాలని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుత స్పిన్ ఆల్రౌండర్లతో టీమిండియా సరిపెట్టుకుంటుందని, కానీ గేమ్ ఛేంజర్ కావాలని నయా కోచ్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నితీశ్ రెడ్డి పేస్తో పాటు భారీ సిక్సర్లు సాధించగలడు. ఇక ఫీల్డింగ్లో అబ్బురపరిచే విన్యాసాలతో సత్తాచాటగలడు. గంభీర్ కోరుకునే నైపుణ్యాలు యువ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డిలో ఉన్నాయి.
అయితే భారత టెస్టు జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి అంత త్వరగా రావడం దాదాపు అసాధ్యమే. హార్దిక్ పాండ్య రెడ్ బాల్తో కఠోర సాధన చేస్తున్నాడు. తిరిగి టెస్టులోకి రావాలని కసిగా ఉన్నాడు. మరోవైపు నితీశ్ ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో ఆకట్టుకోలేకపోయాడు. అయిదు ఇన్నింగ్స్ల్లో కేవలం 61 పరుగులే చేశాడు. రెండు సార్లు డకౌటయ్యాడు. ఒక సారి అజేయంగా నిలిచాడు. బంతితోనూ నిరాశపరిచాడు. రెండు వికెట్లే తీశాడు. అయితే ఫీల్డింగ్లో మాత్రం ఆకట్టుకున్నాడు.
కానీ భారత జట్టులోకి రావడానికి నితీశ్ కుమార్ రెడ్డి నుంచి ఈ ప్రదర్శన సరిపోదు. గంభీర్ బంపారఫర్ ఇచ్చినప్పటికీ నితీశ్ దాన్ని అందుకోలేకపోతున్నాడు. కాగా, జింబాబ్వే టీ20 సిరీస్కు నితీశ్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే గాయంతో అతను జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల కోలుకున్న నితీశ్ దులీప్ ట్రోఫీతో రీఎంట్రీ ఇచ్చాడు. అక్టోబర్లో బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్కు ఈ తెలుగు కుర్రాడు చోటు దక్కించుకుంటాడో లేదా చూడాలి. ఒకవేళ సెలక్ట్ అయ్యి బంగ్లా సిరీస్లో సత్తాచాటితే వన్డే, టెస్టు జట్టులోకి నితీశ్ను గంభీర్ వేగంగా తీసుకువచ్చే ఛాన్స్ ఉంది.