ఢిల్లీ: ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్గా లేకపోతే ఆరో బౌలింగ్ ఆప్షన్ ఎక్కడ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశ్నించాడు. పాండ్యాకు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టే వరకు భారత జట్టులో అసమతుల్యత ఉంటుందన్నాడు. మరో ఆల్రౌండర్గా విజయ్ శంకర్ ఉన్నప్పటికీ హార్దిక్ స్థాయిలో సత్తా చాటలేడని గౌతీ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగిన ఈ మ్యాచ్లో ఆసీస్ 374 పరుగుల భారీ స్కోరు సాధించింది. పూర్తి ఫిట్నెస్తో లేని కారణంగా హార్దిక్ బౌలింగ్కు దూరంగా ఉన్నాడు.
హార్దిక్ పాండ్యాను స్పెషలిస్టు బ్యాట్స్మన్గా జట్టులోకి తీసుకోవడంపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. 'ఇది కీలక సమయం. గత ప్రపంచకప్ నుంచి ఇదే జరుగుతోంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్గా లేకపోతే ఆరో బౌలింగ్ ఆప్షన్ ఎక్కడ?. విజయ్ శంకర్ ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. కానీ ఐదు లేదా ఆరో స్థానంలో హార్దిక్ తరహాలోనే అతడు బ్యాటింగ్ చేయగలడా?. అంతేగాక ఏడు నుంచి ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేయగలడా?. మనీష్ పాండే జట్టులో ఉన్నా, రోహిత్ శర్మ తుదిజట్టులోకి తిరిగొచ్చినా ఇదే పరిస్థితి. టాప్-6లో ఉన్న ఆటగాళ్లలో ఎవరూ బౌలింగ్ చేయలేరు' అని గంభీర్ అన్నాడు.
ఆస్ట్రేలియా జట్టులో ఇలాంటి సమస్యలు లేవని, ప్రత్యామ్నాయ బౌలర్లుగా ఎంతో మంది ఉన్నారని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తెలిపాడు. 'ఆస్ట్రేలియా జట్టును చూస్తే.. హెన్రిక్స్ ఉన్నాడు. అతడు కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు. సీన్ అబాట్ బౌలింగ్ ఆల్రౌండర్. డేనియల్ సామ్స్ కూడా బౌలింగ్, బ్యాటింగ్ చేయగలడు. మరీ హార్దిక్కు పూర్తి ఫిట్నెస్ లేకపోతే భారత్ తరఫున ప్రత్యామ్నాయంగా ఇంకెవరున్నారు?' అని గౌతీ ప్రశ్నించాడు.
భారీ అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వైరస్ నేపథ్యంలో 268 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన టీమిండియాకు తమ తొలి మ్యాచ్లోనే నిరాశపరిచింది. ఫించ్, స్మిత్ సూపర్ సెంచరీలకు తోడు మ్యాక్స్వెల్ మెరుపు ఇన్నింగ్స్తో భారీ స్కోరు అందుకున్న కంగారూలు.. బౌలింగ్లోనూ కట్టడి చేశారు. మొత్తంగా పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, బ్యాటింగ్లో వైఫల్యంతో కోహ్లీసేన ఓటమితో పర్యటన ప్రారంభించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం రెండో వన్డే జరగనుంది.
డబుల్ ధమాఖా.. రేపు రెండు మ్యాచ్లు.. అభిమానులకు పండగే!!