మహిళలు సీరియస్గా ఆడాలి:
తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతం గంభీర్ మాట్లాడుతూ... 'క్రీడల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలి. ఆలా పెరిగితే భారత్ను క్రీడాదేశంగా మార్చాలన్న లక్ష్యం నెరవేరుతుంది. క్రికెట్కు పురుషులు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. మహిళలు కూడా అలానే పరిగణించాలి. మహిళలు మరింత సీరియస్గా క్రికెట్ ఆడాలి. అయితే ప్రస్తుత భారత మహిళా జట్టు గొప్పగా ఆడుతోంది. ప్రపంచకప్లో సెమీ ఫైనల్స్కు వెళ్లారు. అంతకుముందు రన్నరప్గా నిలిచారు. ఇది దేశానికి శుభసూచకం' అని అన్నాడు.
21 నుంచి మహిళా టీ20 ప్రపంచకప్:
2017 వన్డే ప్రపంచకప్లో భారత మహిళా జట్టు రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక 2018 టీ20 ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు వెళ్ళింది. ప్రస్తుతం అద్భుత ఆటతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కివీస్ లాంటి పటిష్ట జట్లను ధీటుగా ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఫిబ్రవరి 21 నుంచి మహిళా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్తోనే మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఇప్పటికే భారత్ ఆసీస్ గడ్దపై ఉన్న విషయం తెలిసిందే.
మంచి ఫిట్నెస్తో ఉన్నారు:
భారత ఆటగాళ్లు మంచి ఫిట్నెస్తో ఉన్నారని గంభీర్ కొనియాడాడు. 'గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం భారత ఆటగాళ్లు గొప్ప ఫిట్నెస్తో ఉన్నారు. గతంలో ఆటగాళ్లు ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. కానీ.. టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత క్రికెట్ పూర్తిగా ఫిటెనెస్తో కూడిన ఆటగా మారిపోయింది. ఆటగాళ్లు బలంగా బాదుతున్నారు. కొందరు అయితే సిక్సులు అలవోకగా కొట్టేస్తున్నారు. ఇదంతా ఫిటెనెస్తోనే సాధ్యమవుతుంది' అని గంభీర్ పేర్కొన్నాడు.
అప్పుడు టీ20 ఫార్మాట్ లేదు:
'నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు టీ20 ఫార్మాట్ లేదు. అప్పట్లో క్రికెట్ అంటే సాంకేతికమైన ఆటగా పరిగణించేవారు. కాలం గడిచేకొద్ది మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు ఫిట్నెస్ లేనిది ఏ ఫార్మాట్లోనూ ఎవరూ రాణించలేరు' అని గంభీర్ చెప్పుకొచ్చాడు. 38 ఏళ్ల గంభీర్ భారత్ తరపున 58 టెస్ట్లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.
అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు:
2004 నుంచి 2016 వరకు అతడి కెరీర్ దిగ్విజయంగా సాగింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో గంభీర్ కూడా ఒకడు కావడం విశేషం. 2007 టీ20 ఫైనల్, 2011 వన్డే ఫైనల్ మ్యాచ్ రెండింట్లోనూ గౌతం టాప్ స్కోరర్ కావడం విశేషం. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు 41.95 సగటుతో 4,154 పరుగులు చేశాడు. 9 శతకాలు, 22 అర్ధ శతకాలు నమోదు చేశాడు.