ముంబై: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చినా.. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలోనే ఆడాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో సూర్య (63; 50 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన గంభీర్.. ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య అన్ని వైపులా షాట్లు ఆడగలడని, స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటాడని ఆయన పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ తిరిగొచ్చినా అతడినే మూడో స్థానంలో చూడాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను చెప్పాడు.
తాజాగా గౌతమ్ గంభీర్ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో మాట్లాడుతూ... 'సూర్యకుమార్ యాదవ్ను మూడో స్థానంలో ఆడించడం భారత జట్టుకు కలిసివస్తోంది. ప్రస్తుత ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్లిద్దరూ సాధిస్తున్న పరుగుల వేగాన్ని సూర్య చక్కగా కొనసాగిస్తాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎలాగైతే ఆస్ట్రేలియా తరఫున నాలుగో స్థానంలో వస్తున్నాడో.. కోహ్లీ కూడా అటువంటి పాత్రే పోషించాలి' అని అన్నాడు.
'ఒకవేళ ఎప్పుడైనా జట్టు ఆదిలోనే పలు వికెట్లు కోల్పోతే అప్పుడు విరాట్ కోహ్లీ మిడిల్ ఆర్డర్ను ముందుకు నడిపించవచ్చు. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ మినహా అనుభవజ్ఞులైన బ్యాట్స్మన్ లేనందున కోహ్లీ అక్కడ ఆడితే సరిపోతుంది. కాబట్టి కోహ్లీ నాలుగో స్థానంలో ఆడటం వల్ల జట్టులో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేస్తాడు. సూర్యకుమార్ యాదవ్ ఎన్ని పరుగులు చేసినా చివరి వరకూ క్రీజులోనే ఉండి మ్యాచ్ గెలిపించడమే ముఖ్యం. ఈ విషయంలో నేను నిరాశ చెందా. తొలి టీ20లో అతడు ఔట్ అవ్వడం బాలేదు' అని గౌతమ్ గంభీర్ చెప్పాడు.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా జైపూర్ వేదికగా న్యూజిల్యాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు ఉండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ (15) విఫలమయినా.. రోహిత్ శర్మ (48; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ బాదాడు. ఇన్నింగ్స్ చివరలో ఉత్కంఠ రేగినా.. రిషబ్ పంత్ బౌండరీ బాది టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో మూడు మ్యాచుల టీ20ల సిరీస్లో రోహిత్ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది.